తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల కింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు మంగళవారం నాడు బ్యాంకర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
రైతుబంధు నిధులను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈ సందర్భంగా బ్యాంకర్లు తెలిపారు. భవిష్యత్తులో రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని మంత్రి హరీశ్ రావు బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిలిపివేయబడిన/సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతుల ఖాతాకు జమ చేయాలన్నారు. ఈ అంశంపై బ్యాంకర్లు తమ తమ బ్యాంకు బ్రాంచీలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయిలో పర్యవేక్షించుటకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి టీం మానిటరింగ్ చేస్తుందని చెప్పారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు 18002001001 మరియు 04033671300 ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఆదే విధంగా పంట రుణాల రెన్యూవల్, పంపిణీని బ్యాంకర్లు వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిఎం నటరాజన్, బ్యాంక్ ఆఫ్ బరోడా జిఎం మన్ మోహన్ గుప్తా, ఎస్ఎల్బిసి డిజిఎం శేష్ కుమార్ ఆదిరాజు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిఎం షేక్ హుస్సేన్, కెనరా బ్యాంక్ డిజిఎం ఎస్.వి.జె.వేణు గోపాల్, టిఎస్ సీఏబి ఎండి డాక్టర్ ఎన్.మురళీధర్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎజిఎం ఆర్.వి.శారద, ఏపీజివిబి జిఎం పి.పార్థసారధి, టిజిబి జిఎం సతీష్ కుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ