హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీ మాదిరి డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించి ఇస్తున్నామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. మంగళవారం ఆయన సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కోహిర్ మండలం, దిగ్వాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్ చింత ప్రభాకర్ సహా పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లను నిర్మిస్తారని, అదేవిధంగా ఇక్కడ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇంతకుముందు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఇళ్లు చూసారా? అని ప్రశ్నించారు. అప్పట్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దక్కాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఎక్కడా, ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన పనిలేదని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పేదవారికి గూడు కల్పించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నాణ్యమైన డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించి ఇస్తున్నారని, ఖాళీ స్థలం ఉన్నవారికి కూడా డబ్బులు అందించే కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. ఇక రూ.5.60 కోట్ల నిధులతో కోహిర్లో 88 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించామని, అలాగే రూ.50 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, ఇక్కడ త్వరలోనే డయాలసిస్ కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. రూ.150కోట్లతో జహీరాబాద్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రారంభించి గోదావరి జలాలను జహీరాబాద్కు తరలిస్తామని తెలియజేశారు. ఇక రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ కానుందని, ఈ మాదిరి సంక్షేమ పధకాలు దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎక్కడా అమలవడం లేదని మంత్రి హరీష్ రావు చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY