టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని, ఇక్కడి ప్రజలకు దీనిపై స్పష్టత ఉందని వ్యాఖ్యానించారు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. ఈ మేరకు ఆయన ఖమ్మం పట్టణంలో బుధవారం టీటీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజయ శంఖారావం’ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గురువారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇతర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులతో కలిసి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు చంద్రబాబుపై, ఆయన పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పాలనలో విఫలమైనందునే ఆంధ్రా ప్రజలు గత ఎన్నికల్లో ఆయన పార్టీని చిత్తుగా ఓడించారని, ఇక ఆంధ్రాలో చెల్లని రూపాయి, తెలంగాణలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనపై తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉందని, ఆయన పాలనలో బషీర్ బాగ్ కాల్పుల ఘటన ప్రజలకు ఇంకా గుర్తుందని తెలిపారు. తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు, విభజన అనంతరం ఏపీని ఎందుకని అభివృధి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. నల్గొండలో ఫ్లోరోసిస్కు పరిష్కారం చూపానని చంద్రబాబు చెబుతున్నారని, అప్పటి పాలకులు కేవలం ఈ సమస్యను ఓట్ల కోసమే వాడుకున్నారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాకే ఫ్లోరైడ్ భూతాన్ని పారద్రోలారని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో వందలాది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఈ ప్రాంతం గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో ఆంధ్రాలో పొత్తు పెట్టుకొనేందుకే ఆయన ప్రయత్నాలని, అయితే ఆయనతో ఎవరు పొత్తు పెట్టుకున్నా చివరకు వారికి అది భస్మాసుర హస్తమే అవుతుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ