ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణ నుంచి కనకరాజుకు కళా రంగంలో పద్మశ్రీ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో కనకరాజును బుధవారం నాడు ఘనంగా సన్మానించారు. రాజ్ గోండు గిరిజనుల ప్రత్యేక నాట్య కళ గుస్సాడీలో అపార నైపుణ్యం గడించిన కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడీ రాజు కనకరాజు సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివాసీగూడేల్లో మాత్రమే కనిపించే గుస్సాడీ నృత్యం ఒక విశిష్టమైన కళ అని అభివర్ణించారు.
ఆదివాసీ నృత్యం గుస్సాడీని కొత్త తరానికి అందిస్తున్న కనకరాజు సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వంకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాచీన నృత్యంపై మైదాన ప్రాంతాల్లోని వారికి అవగాహన తక్కువ అన్నారు. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాచీన దేవతా కళ తరతరాలు దాటుకుంటూ ప్రస్తుత రోబోటిక్ యుగంలోనూ కోనసాగుతోందన్నారు. గుస్సాడీ నాట్యానికి మెరుగులు దిద్దటమే కాకుండా నేటి తరానికి శిక్షణ ఇస్తూ మరింత గొప్ప కళగా తీర్చిదిద్దుతున్న కనకరాజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించి, ఘనంగా సన్మానించారు.
పద్మశ్రీ పురస్కారం పొందిన కనకరాజు సేవలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున 10 వేల రూపాయల ప్రత్యేక పెన్షన్ ను అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లి అమలు చేస్తామన్నారు. కనకరాజుతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన 12 మెట్ల కిన్నెర విద్వాంసులు, దర్శనం మొగిలయ్యకు త్వరలోనే అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ, కనకరాజు బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ