ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గొప్ప మనసున్న మారాజు అని రాష్ట్ర పశుసంవర్డక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం గాంధీ హాస్పిటల్, ఎర్రగడ్డ లోని చెస్ట్ హాస్పిటల్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి పేషంట్ సహాయకులకు మూడు పూటల ఆహరం అందించేందుకు ఏర్పాటు చేసిన 5 రూపాయల బోజన కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించి, భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా పేషంట్ సహాయకులతో మాట్లాడి హాస్పిటల్ లో అందిస్తున్న వైద్యసేవల గురించి, ఆహారం కోసం పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. తాము భోజనం కోసం దూరంగా ఉన్న హోటళ్ళ వద్దకు వెళ్ళి తెచ్చుకుంటున్నామని, రోజుకు 300 రూపాయల వరకు ఖర్చవుతుందని పలువురు మంత్రికి వివరించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ కు వైద్య సేవల కోసం వచ్చే పేషంట్ తరపు కుటుంబ సభ్యులు, బంధువులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యేక బోజన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.
కరోనా బారిన పడిన వారికి వైద్య సేవలకు గాంధీ హాస్పిటల్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది:
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగిందని చెప్పారు. కార్పోరేట్ హాస్పిటల్స్ కు దీటుగా గాంధీ హాస్పిటల్ లో వైద్య సేవలను అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. కోట్లాది రూపాయల విలువైన సిటి స్కాన్, ఎంఆర్ఐ, క్యాత్ ల్యాబ్ వంటి అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి వేలాది రూపాయల విలువైన పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు వివరించారు. పేద ప్రజలు వైద్యసేవల కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్ళి ఆర్ధికంగా ఎంతో నష్టపోతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం పేద ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఆధునీకరించి మరింత మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో కరోనా బారిన పడిన వారికి వైద్య సేవలకు గాంధీ హాస్పిటల్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. సుమారు లక్ష మంది కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించినట్లు చెప్పారు. చెస్ట్ హాస్పిటల్ లో కూడా కరోనా బాధితులకు సేవలు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఒక వైపు ప్రభుత్వ హాస్పిటల్స్ లో సౌకర్యాలు మెరుగుపరుస్తూనే మరో వైపు పేషంట్స్ కు నాణ్యమైన ఆహరం అందించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఖర్చు చేస్తున్న నిధులను కూడా రెట్టింపు చేయడం జరిగిందని తెలిపారు.
నగరంలోని 18 ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్స్ లో భోజన కేంద్రాలు ప్రారంభం:
అంతేకాకుండా పేషంట్ వెంట వచ్చే వారి సహాయకుల బాగోగుల గురించి సీఎం కేసీఆర్ ఆలోచించారంటే ఆయన ఎంత గొప్ప మానవతావాదో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. నగరంలోని 18 ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్స్ పేషంట్ సహాయకులకు ఉదయం బ్రేక్ పాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేందుకు హాస్పిటల్స్ ఆవరణలోనే అన్ని సౌకర్యాలతో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. కేవలం 5 రూపాయలకే భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు. జీహెఛ్ఎంసీ పరిధిలోని అన్నపూర్ణ కేంద్రాలకు ఎంతో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న హరే కృష్ణ మూవ్ మెంట్ ఫౌండేషన్ ద్వారానే ఈ కేంద్రాలకు భోజనాలు సరఫరా చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అన్నారు. ఉదయం బ్రేక్ పాస్ట్ గా కర్డ్ రైస్, పులిహోర, వెజిటబుల్ పలావ్, సాంబార్ రైస్, మధ్యాహ్నం, రాత్రి భోజనంలోకి రైస్, సాంబార్, పప్పు, కూర, పచ్చడి అందించడం జరుగుతుందని వివరించారు. ఇందుకోసం ప్రభుత్వం సంవత్సరానికి సుమారు 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తుందని చెప్పారు. పేద ప్రజలకు మేలు చేసేందుకు ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్స్ కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ హాస్పిటల్ ఆర్ఎంఓ జయకృష్ణ, గాంధీ, చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ లు రాజారావు, మహబూబ్ ఖాన్, ఎర్రగడ్డ కార్పొరేటర్ దేదీప్య, హరేకృష్ణ మూవ్ మెంట్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF