ప్రపంచ దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయడంలో హైదరాబాద్ ప్రధాన భూమికగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాదు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నాడు కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహ పడరాదని, పుకార్లు నమ్మరాదని మంత్రి సూచించారు. కరోనా వ్యాక్సిన్ పై ఇంకా ప్రజలలో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ ను 16వ తేది నుండి హైదరాబాద్ జిల్లాలో వేయడం ప్రారంభించారని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చే వారికి సకల సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే ప్రజలలో వ్యాక్సిన్ పై సదాభిప్రాయం కలుగుతుందన్నారు. హైదరాబాదు జిల్లాలో జనాభా ఎక్కువగా ఉన్నందున మున్ముందు వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రజలకు అవగాహన కలిపించడానికి, భయాన్ని తొలగించడానికి ప్రతి రోజు జరిగిన వ్యాక్సినేషన్ పై అందరికి తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, కరోనా సమయంలో హెల్త్ వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ, పోలీసులు రిస్క్ తీసుకొని సేవ చేశారని, వారికి కూడా కరోనా వ్యాక్సిన్ అందించాలన్నారు. ప్రతి వ్యాక్సిన్ కేంద్రంలో ప్రతి రోజు 50 మందికి తగ్గకుండా వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. జిల్లా కలెక్టరు పర్యవేక్షణలో కరోనా వ్యాక్సినేషన్ బాగా జరుగుతుందన్నారు. కరోనాతో భయానక వాతావరణంలో ప్రజలు జీవించారు. శానిటైజర్, మాస్క్ మన జీవితంలో ఒక భాగమయ్యాయన్నారు.
జిల్లా కలెక్టరు శ్వేతా మహాంతి మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్ పై బృందాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. పర్యవేక్షణ గదులలో అవసరమైన సదుపాయాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, పోలీసు కమీషనర్ అంజనీ కుమార్, జిహెచ్ఎంసి అడిషనల్ కమీషనర్ సంతోష్ కుమార్, డిఎం అండ్ హెఛ్ఓ వెంకటి, డిఐఓలు, ఎస్పిహెచ్ ఓలు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ