తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయం (రుద్రేశ్వర దేవాలయం) యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. ఆదివారం నాడు జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 44వ సమావేశంలో రామప్ప దేవాలయంకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాలంపేటలో క్రీ.శ.1213లో నిర్మితమైన ఈ రామప్ప దేవాలయం కాకతీయ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచింది. దేవాలయ వాస్తుశిల్పి రామప్ప పేరు మీద ఈ అద్భుతమైన కట్టడం ప్రాచుర్యంలోకి వచ్చింది. ముందుగా 2019 సంవత్సరానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద ట్యాగ్ కోసం కేంద్ర ప్రభుత్వం రామప్ప దేవాలయంను నామినేషన్ గా ప్రతిపాదించింది. భారతదేశంలో యునెస్కో గుర్తింపు పొందిన కట్టడాల్లో రామప్ప దేవాలయం 39వది కాగా, తెలంగాణ రాష్ట్రంలో మొదటిదిగా నిలిచింది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
అలాగే ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్ప కళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. స్వయం పాలనలో కూడా తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం అన్నారు. కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పను, ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు కోసం మద్దతు తెలిపిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కృషి చేసిన తెలంగాణ ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ