హైదరాబాద్ లోని హాకా భవన్ లో 2022 పత్తి కొనుగోళ్లపై సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలలో పత్తి సాగు అయ్యిందని, పత్తి కొనుగోళ్లకు సన్నద్దం కావాలని అన్నారు. అననుకూల వాతావరణ పరిస్థితులల్లో కూడా 50 లక్షల ఎకరాలలో సాగుచేయడం గమనార్హం అని పేర్కొన్నారు.
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో పత్తి సరాసరి దిగుబడి తగ్గినా, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ నేపథ్యంలో పత్తికి మంచి ధర లభించే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ లో క్వింటాలు పత్తి ధర సుమారు రూ.8 వేలు ఉన్నదని, అయినప్పటికీ రైతులకు మద్దతుధర (రూ.6380)కు పైగా లభించేవిధంగా మార్కెటింగ్ శాఖ, సీసీఐ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుత ప్రపంచవ్యాప్త పరిస్థితులు చూస్తుంటే రాబోయేకాలంలో పత్తికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున రైతులు పత్తి సాగు పెంచే దిశగా అడుగులు వేయాలని సూచించారు. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు పత్తి కొనుగోళ్లలో సంపూర్ణంగా భాగస్వాములు కావాలి, ఇప్పటికే 313 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేయాలని గుర్తించి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు చేశామన్నారు. అలాగే 121 వ్యవసాయ మార్కెట్ యార్డులను సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా ప్రతిపాదన చేశామని చెప్పారు.
“సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో సాఫ్ట్ వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, తేమ కొలిచే యంత్రాలు ఏర్పాటు చేయాలి మరియు అవసరమైన సిబ్బందిని మార్కెటింగ్ శాఖ వెంటనే నియమించాలి. ప్రతి కొనుగోలు కేంద్రం వారానికి ఆరు రోజులు పనిచేసే విధంగా సీసీఐ మేనేజర్లు ప్రణాళిక సిద్దం చేయాలి. పత్తి కొనుగోళ్లను పరిశీలించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చాం. జిన్నింగ్ మిల్లర్లు అందరూ సీసీఐ టెండర్లలో విధిగా పాల్గొంటామని సానుకూలత వ్యక్తం చేశారు. పత్తి నాణ్యత పరీక్షించడానికి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రయోగశాల నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. దీనివల్ల రాబోయే కాలంలో నాణ్యతపరంగా రైతులకు మంచి ధరతో పాటు జిన్నింగ్ మిల్లులకు మేలు జరుగుతుంది. సీసీఐ వద్ద జిన్నింగ్ మిల్లులకు ఉన్న సమస్యలను వెంటనే పరిశీలించాలని సీసీఐకి సూచించాం, సీసీఐ సానుకూలంగా స్పందించింది” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు లక్ష్మణుడు, రవికుమార్, సీసీఐ జనరల్ మేనేజర్ అమర్ నాథ్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ మల్లేశం, బ్రాంచ్ మేనేజర్లు బ్రిజేష్ కుమార్, మహేశ్వర్ రెడ్డిలు, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కార్యదర్శి రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY