తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 18, శుక్రవారం నాడు మేడారం మహా జాతరకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారక్క దేవతలకు సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకోనున్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క–సారలమ్మల మహా జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, జాతర ధర్మకర్తల మండలి చైర్మన్ కొర్నిబెల్లి శివయ్య, మేడారం దేవాలయ ఈవో రాజేందర్, ఇతర అధికారులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి జాతరకు హాజరుకావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
మరోవైపు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరైనా మేడారం జాతరకు ఈసారి కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మేడారం జాతర కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. అలాగే మేడారంలో పరిస్థితులను రాష్ట్ర మంత్రులు, ఆప్రాంత ఎమ్మెల్యేలు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భక్తులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో వారికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించారు. జాతర ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. మేడారంలో దాదాపు 9000 మంది పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ