ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణ ఆర్థిక, సామాజిక, అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతి వచ్చిందని, గత తెలంగాణ, ప్రస్తుత తెలంగాణలను పోల్చుతూ మరింత పరిశోధనాత్మక రచనలు వెలువడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ అన్నారు. గురువారం బీఆర్కెఆర్ భవన్ లోని తన కార్యాలయంలో ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, డా.ద్యావనపల్లి సత్యనారాయణలు రాసిన తెలంగాణ హిస్టరీ, కల్చర్, మూమెంట్స్ అనే పుస్తకాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మూలమూలకు చరిత్ర ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారని, ఈ గ్రంధంలోని చారిత్రకాంశాలను చూస్తే ఇది మరోసారి నిరూపిస్తోందని పేర్కొన్నారు.
“ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రను రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమైందని చెప్తూ వస్తున్నారు. కాని తెలంగాణ భూభాగంలో 18 లక్షల సంత్సరాల క్రితం నుంచే ఆది మానవులు ఎదుగుతూ వచ్చారు. ఆ పరిణామ క్రమంతో పాటు ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాల చరిత్రను సమగ్రంగా విశ్లేషిస్తూ ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాల’ను ప్రత్యేకంగా వివరిస్తూ విషయ నిపుణులు ఆచార్య అడపా సత్యనారాయణ, డా.ద్యావనపల్లి సత్యనారాయణ ఆంగ్లంలో ‘తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ మూమెంట్స్‘ అనే గ్రంథాన్ని సాధికారికంగా రాయడం” అభినందనీయమని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ కిషోర్, తెలంగాణ పబ్లికేషన్స్ కార్యదర్శి చంద్ర మోహన్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇక్కడి చరిత్ర, సంస్కృతీ, సామాజిక వ్యవస్థను విశ్లేషిస్తూ, పెద్ద ఎత్తున సాహిత్యం పుస్తకరూపంలో వస్తున్నప్పటికీ, ఇది మరింత ఎక్కువగా రావాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 90 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ కాంపిటీటివ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ గ్రంధం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ చరిత్రను వక్రీకరించే విధంగా పలు సినిమాలు వస్తున్నాయని, ఇదే కోవలో మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశమున్నందున తెలంగాణ చారిత్రిక, సాంస్కృతిక, సామాజిక అంశాలపై ఇలాంటి సాధికారిక గ్రంధాలు రావాల్సిన అవసరముందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల చరిత్రకారులకు తమ రాష్ట్ర చరిత్ర రచనకు ఈ గ్రంధం ప్రామాణికంగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రను సాధికారికంగా తెలిపే ఈ గ్రంధాన్ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ అధికారులకు పంపడంతోపాటు వివిధ రాష్ట్రాల్లోని టూరిజం స్టాళ్లలో కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సందర్బంగా ఈ గ్రంథ రచయితలైన అడపా సత్యనారాయణ, ద్యావనపల్లి సత్యనారాయణలు తమ అభిప్రాయాలను తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY