షెడ్యూల్ విడుదలైన తెలంగాణ తో పాటు.. ఇంకా అటువంటిది ఏమీ లేని ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. పోటాపోటీ బస్సు యాత్రలు, పాద యాత్రలతో ప్రధాన పార్టీల నేతలు ప్రజల్లోనే ఉంటున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఈ క్రమంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇప్పటి నుంచే చర్చలు జరుగుతున్నాయి. ఒకరకంగా చూస్తే తెలంగాణలో కంటే ఏపీలోనే మాటల తూటాలు వాడివేడిగా పేలుతున్నాయి. జైలులో తనపై హత్యకు కుట్ర జరుగుతుందంటూ జడ్జికి చంద్రబాబు రాసిన లేఖపై రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పుడు టాపిక్ అది కాబట్టి.. ఆ అంశాన్ని పక్కన బెడితే.. నెక్ట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబేనా అన్న చర్చ జరుగుతోంది. జగన్ జైలుకెళ్లి 2019లో ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి.. ప్రస్తుతం జైలుకెళ్లి బెయిలుపై వచ్చిన చంద్రబాబు 2024లో ఆయనే సీఎం అవుతారా..? ఏపీ ప్రజలు జైలుకెళ్లి వచ్చారు కాబట్టి ఈసారి బాబుకు పట్టం కడతారా అనే ఆసక్తికర వాదన నడుస్తోంది.
అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో 2012 మే 27 న వైఎస్ జగన్మోహన్ రెడ్దిని సీబీఐ అరెస్ట్ చేసింది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనేది ఆయనపై ఉన్న ఆరోపణలు. మైనింగ్ లీజులు, ప్రాజెక్టుల కేటాయింపుల రూపంలో తమకు అనుమతులు లభించాయన్న ఆరోపణలపై రెడ్డి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన 58 కంపెనీలకు కూడా సీబీఐ, ఈడీ సమన్లు కూడా పంపాయి. వాటిపై విచారణ కొనసాగుతుండగా అతడి జ్యుడీషియల్ కస్టడీ పదే పదే పొడిగిస్తూ వచ్చారు.
16 నెలల పాటు జగన్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబరు 23 న నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అనుభవ శాలి కావాలంటూ ఏపీ ప్రజలు జగన్ జైలుకెళ్లి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకే పట్టం కట్టారు. అయితే.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం బ్రహ్మాండమైన మెజార్టీతో జగన్ సర్కారును గెలిపించారు.
ఇప్పుడు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టయి జైలు పాలయ్యారు. దాదాపు 52 రోజులు జైలు జీవితం అనుభవించి బెయిలుపై బయటకు వచ్చారు. ఆయన అరెస్టును వైసీపీకి ఆపాదిస్తూ టీడీపీ ప్రచారం చేస్తోంది. బాబు కుటుంబ సభ్యులతో పాటు.. టీడీపీ శ్రేణులు కూడా అరెస్టునే రాజకీయ అస్త్రంగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ గ్రాఫ్ పెరిగిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. జైలులో ఉన్న చంద్రబాబు కూడా లేఖలు, ములాఖత్ అవుతున్న నేతల ద్వారా తన సందేశాన్ని పంపుతూ రాజకీయ చర్చలు రేపారు. జైలులో ఉన్నట్లు లేదు.. మీరు చూపుతున్న ఆదరణ ద్వారా ప్రజల్లో ఉన్నంట్టుంది అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే.. తన హత్యకు జైలులో కుట్ర జరుగుతోందంటూ సంచలన ఆరోపణలూ చేస్తున్నారు. అప్పుడు జగన్.. ఇప్పుడు చంద్రబాబు న్యాయపరిభాషలో నిందితులే తప్పా.. దోషులు కాదు. ఈ క్రమంలో బాబుకు షరతులతో కూడిన బెయిలు వచ్చింది. అది మున్ముందు కొనసాగుతుందా.. లేదా అనేది పక్కన బెడితే జైలుకెళ్లిన చంద్రబాబుకు కూడా ఏపీ వాసులు పట్టం కడతారా అన్న చర్చ ఇప్పటి నుంచే నడుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ