మునుగోడు ఉపఎన్నిక జరుగనున్న నేపథ్యంలో తెలంగాణలో మరోసారి పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీతో కలిసి సాగుతామంటూ కమ్యూనిస్ట్ ఉభయ పార్టీలు స్పష్టం చేయడం తెలిసిందే. అలాగే ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దీనిపై మరిన్ని ఊహాగానాలకు ఊతమిచ్చాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ తమతో కలవొచ్చు అనేలా మాట్లాడటంపై ఎవరికీ తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చన్న ఊహాగానాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. గురువారం కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర లంచ్ బ్రేక్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి రాహుల్ యాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్తో పొత్తు వుండదని వరంగల్ బహిరంగ సభలోనే రాహుల్ స్పష్టం చేశారని రేవంత్ గుర్తు చేశారు. టీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో చేసిన పాపాలను మోసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని, కలలో కూడా ఆ పార్టీతో పొత్తు అనేది కుదరని అంశమని తేల్చి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ను భూస్థాపితం చేయడానికి సీఎం కేసీఆర్ కుట్రలు చేశారని, అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్నారని అన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్పై ఆయన చేసిన ప్రయోగం వికటించి, బీజేపీ రూపంలో తిరిగి ఆయనకే ఇప్పుడు తగులుతోందని తెలిపారు. ఇప్పుడు అదే కేసీఆర్ పాలిట శాపంగా మారిందని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమి తథ్యమని వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ బీజేపీలో పట్టుమని పదిమంది కూడా గెలిచే నాయకులు లేరని రేవంత్ ఎద్దేవా చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ