ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడు మండల కేంద్రంలో శనివారం జరిగిన టీఆర్ఎస్ ‘ప్రజా దీవెన’ భారీ బహిరంగ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు అంశాలను ప్రస్తావిస్తూ కీలక ప్రసంగం చేశారు. ప్రజల చేతుల్లో ఓటు ఒక ఆయుధం అని, దాన్ని ఆలోచించి ఉపయోగించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ అవసరం ఉండి, ఎవరి మంచికోరి ఈ ఉప ఎన్నిక వచ్చిందని ప్రశ్నించారు. మిషన్ భగీరథతో మునుగోడును ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా మార్చామన్నారు. పొలాల్లో బావులు, మోటర్ల దగ్గర మీటర్ పెట్టే అంశంపై సీఎం తీవ్రంగా స్పందించారు. బావి దగ్గర మీటర్ పెట్టమంటే, చచ్చినా పెట్టనని కేంద్రానికే చెప్పానన్నారు. ఎరువుల ధరలు, కరెంట్ రేటు పెంచేస్తున్నారని, రైతులు వ్యవసాయం మానేలా కుట్ర జరుగుతోందన్నారు.
కార్పొరేట్ వ్యవసాయం అంటూ మోదీ దోస్తులు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో చిన్నరైతు, పెద్ద రైతు అని లేకుండా అందరికీ లక్షమందికిపైగా రైతు బంధు పథకం అమలవుతుందన్నారు. ఒకప్పుడు ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడేదని, కానీ ఇప్పుడు రైతు ఏ కారణం వల్ల చనిపోయినా పది రోజులు కూడా తిరగకుండానే వారి ఖాతాలో రైతు భీమా ద్వారా రూ.5 లక్షలు పడుతోందని చెప్పారు. రైతు బంధు పథకం ఆగదని, మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మోటార్లకు మీటర్లు పెట్టే నరేంద్ర మోదీ కావాలా?, మీటర్లు పెట్టనని కొట్లాడుతున్న కేసీఆర్ కావాలా? తేల్చుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విషయంపై గ్రామాల్లో చర్చ జరగాలని, విద్యావంతులు, యువకులు, పెద్దలు, రైతుబంధు పొందుతున్న లక్ష మంది రైతులు చర్చించాలని కోరారు.
రాష్ట్రానికి కరెంట్ బంద్ చేయాలని చూస్తున్నారని, కరెంట్ పోతే ఎంతో ఇబ్బంది ఉంటుందని, కరెంట్ పోకుండా చూస్తున్నామని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేలు ఉండగా, అందులో టీఆర్ఎస్ సభ్యులు 103 మంది కాగా, ఇంకో ఏడుగురు మిత్రపక్ష సభ్యులు ఉన్నారన్నారు. మిగిలిన తొమ్మిది తోకల్లో రెండు పార్టీలు ఉన్నాయని, వాటిల్లో మూడు తోకలున్నోడు 110 తోకలు ఉన్నోన్ని పడగొట్టి, ఏక్నాథ్ షిండేను తెస్తానని అంటున్నారని, ఇది ప్రజాస్వామ్యమా? అహంకారమా? అని సీఎం ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఏమవుతుంది? బావిలో పడేసినట్లే. కాంగ్రెస్ గెలిచేదా? వచ్చేదా? ఏదైనా చేసేదుందా అని విమర్శించారు. బీజేపీని తరిమికొడితేనే విముక్తి అని, కొట్లాడే వాడి చేతికే కత్తి ఇవ్వండి అని ప్రజలను సీఎం కోరారు. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదని, మన జీవితాల ఎన్నిక, మన బతుకుదెరువు ఎన్నిక అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది వ్యక్తి కోసమో, పార్టీ కోసం జరుగుతున్నది కాదని, ప్రజలంతా ఆలోచించి ఓటువేయాలని సూచించారు. మునుగోడులో ఉప ఎన్నికను ఆషామాషీగా తీసుకోవద్దని, భారీ మెజారిటీతో గెలవాలన్నారు. చుండూరులో మళ్ళీ సభ పెడదామని, అప్పుడు వేరేవాళ్ళని తీసుకొస్తానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY