తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టఫ్ ఫైట్ మాత్రమే ఉంటుందని అంతా భావించారు. కానీ వార్ వన్ సైడ్ అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు కూడా ఊహించని మెజార్టీతో హస్తం పార్టీ విజయాన్ని హస్త గతం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలకు మించి వచ్చిన ఫలితాలు గులాబీ పార్టీని మూలన కూర్చోబెట్టేసింది.
హంగ్ వచ్చినా కూడా అరక్షణంలో చక్కదిద్దేయగల అపర చాణుక్యుడి వ్యూహాలను తలకిందులు చేసేలా వచ్చిన ఫలితాలు.. గులాబీ బాస్కు దిక్కుతోచనీకుండా చేశాయి. బీజేపీ, ఎంఐఎం కూటమితో అధికారాన్ని దక్కించుకునే అవకాశాలను కూడా దూరం చేశాయి. బతిమాలో, కాళ్లా వేళ్లా పడో, కాసుల వర్షం కురిపించో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్ధులను తమ వైపు తిప్పుకోవడం తప్ప వేరే మార్గం అయితే బీఆర్ఎస్ ముందు లేదు.
ఇది ముందుగానే ఊహించిన కాంగ్రెస్ అధిష్టానం గెలిచిన అభ్యర్థుల ఇంటి ముందు బాడీ గార్డులను కూడా నియమించి..తమ అభ్యర్థులను ఎటూ ఎగిరిపోకుండా పగడ్బంధీగా ఏర్పాట్లు చేసేసింది. అయితే నిజానికి ఇది కాంగ్రెస్ గెలుపు కాదని.. కేవలం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓటర్లు ఓడించడమే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కేవలం కేసీఆర్ను ఓడించడానికే జనాలు కాంగ్రెస్కు ఓటేసారు తప్ప.. కాంగ్రెస్ మీద అంత అభిమానం ఏమీ లేదన్న వాదన వినిపిస్తోంది.
కాంగ్రెస్ కోసం పాజిటివ్గా ఆలోచించే ప్రజలు లేకపోయినా కేసీఆర్ మీద ఉన్న నెగెటివిటీనే ..ఇప్పుడు కాంగ్రెస్కు ఓట్లు పడేలా చేసింది. దీని ఫలితమే కామారెడ్డిలో కేసీఆర్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అంతకుముందు ఉపఎన్నికల సమయంలోనే కేసీఆర్ ఓడిపోతే.. తెలంగాణ ప్రజలంతా తామే ఓడిపోయినట్టుగా బాధపడిపోయేవారు. తెలంగాణ ప్రజలకు ఇక పెద్ద దిక్కు ఎవరుంటారనేట్లుగా విలవిలలాడిపోయేవారు.
కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద ఫుల్ నెగిటివిటీ వచ్చేసింది. కానీ అటు కేసీఆర్ నుంచి కేటీఆర్ వరకూ తామే మూడోసారి అధికారంలోకి వస్తామన్న ధీమా మాత్రం బాగా పెరిగిపోయింది. హ్యాట్రిక్ కొట్టి సీఎం పీఠంలో మరోసారి కూర్చుంటానని అనుకున్న లెక్కలను ప్రజలను తీసి పడేశారు. తాను ప్రవేశపెట్టిన పథకాలు తమను గెలపిస్తాయని అనుకున్నారు కానీ అవి ఎంతమంది జనాలకు రీచ్ అయ్యాయన్న రికార్డులను రప్పించుకోలేకపోయారు.
కుటుంబ పాలన,టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గామార్చడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు, ధరణి భూములు ఆక్రమించుకున్నారన్న విమర్శలను కేసీఆర్ ఏమాత్రం తిప్పి కొట్టలేకపోయారు. దీంతో మిగతా పార్టీల మీద ఏ మాత్రం ప్రేమ లేకపోయినా..కేవలం కేసీఆర్ మీద ఉన్న కోపంతోనే ఆ పార్టీలకు ఓట్లు గుద్ధి మరీ కాంగ్రెస్ను గెలిపించారన్న వాదన వినిపిస్తోంది.
దీనికి తోడు ఉద్యమ నాయకుడి నుంచి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత కేసీఆర్.. వ్యవహార శైలిలో కనిపించిన మార్పును తెలంగాణవాసులు తట్టుకోలేకపోయారు. అంతేకాదు విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు తిరిగి అదే నియోజకవర్గాలలో టికెట్లు ఇవ్వడం కేసీఆర్కు అతి పెద్ద మైనస్ అయింది.
తనకు తిరుగులేదనే విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా తీసుకున్న నిర్ణయాలు ఒక రకంగా తెలంగాణ ప్రజలను కేసీఆర్కు దూరం చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ గెలుపు కంటే బీఆర్ఎస్ ఓటమిగానే ఓటర్లు ఈ ఎన్నికలను చూశారని చెప్పడానికి ఈ ఫలితాలే నిదర్శనమని అంటున్నారు.
తెలంగాణ కోసం కొట్లాడిన నేతగా.. ఉద్యమాల పార్టీ నాయకుడిగా పేరు బడ్డ కేసీఆర్ ఇమేజ్ ఇప్పుడు తెలంగాణాలో కనుమరుగయిందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాపులారిటీ తెచ్చిపెట్టిన తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదం..తర్వాత చప్పబడింది. ఎప్పుడయితే టీఆర్ఎస్ పేరును జాతీయ పార్టీని చేస్తూ బీఆర్ఎస్గా మార్చారో అప్పుడే కేసీఆర్ను పరాయివాడిగా చూడటం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు.
దీనికి తోడు ఒకప్పుడు కేసీఆర్ సభ పెట్టారంటే..అపోజిషన్ లీడర్ కూడా తన పార్టీని కాసేపు మరిచిపోయి కేసీఆర్ జపాన్నిపఠించేలా ఉండేది. కానీ కొన్నాళ్లుగా కేసీఆర్ మాటల్లో పదును తగ్గింది.పంచ్లు తగ్గాయి..వాడి, వేడి కూడా తగ్గిపోయాయి.కానీ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ వల్లే అనేది చరిత్రలో నిలిచిపోయిన వాస్తవం. అందుకే తెలంగాణ ప్రజలు రెండు సార్లు కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసి ఆ రుణాన్ని తీర్చుకున్నారు. మారుతున్న పరిస్థితులతో మూడోసారి మాత్రం కేసీఆర్ వైపు తొంగి కూడా చూడలేకపోయారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE