దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల మంగళవారం నాడు హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామన్నారు. ఈ రోజు నల్గొండ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించామని, ప్రతి జిల్లా నేతలతో మాట్లాడాలన్నది ఉద్దేశమని పేర్కొన్నారు.
“క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్ధం చేసుకోవడానికే ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించాం. నల్గొండ నుంచి ఒక్క జిల్లా నేతలను సమావేశానికి రమ్మన్నాము. వారి నుంచి క్షేత్రస్థాయి పరిస్థితులు, వారిచ్చే సూచనలు, సమాచారం తెలుసుకోడానికి ఈ సమావేశం జరిగింది. నల్గొండ జిల్లా నాయకులను ఈ రోజు కలిసినట్టు ప్రతి జిల్లా నేతలను క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకు కలవబోతున్నాం. వైఎస్ఆర్ లేని లోటు తెలంగాణలో ఉంది. ఇప్పుడు రాజన్న రాజ్యం లేదు. ఎందుకు లేదు, ఎందుకు రాకూడదు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం” అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
ముందుగా లోటస్ పాండ్ లోని ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అభిమానులకు వైఎస్ షర్మిల అభివాదం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షర్మిలపై కాగితపు పూల వర్షం కురిపించారు. బాణ సంచా కాలుస్తూ, డ్రమ్స్ వాయిస్తూ, నృత్యాలతో సందడి చేశారు. వైఎస్ఆర్ అభిమానులారా తరలి రండి అంటూ గతంలో వైఎస్ఆర్ తో అనుబంధం ఉన్న నేతలకు, ఆయనతో పని చేసిన వారికి షర్మిల తరఫున ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. షర్మిల ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ అభిమానులు షర్మిల ఇంటికి భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ