వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం లోటస్ పాండ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తానూ చేపట్టబోయే పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ‘ప్రజా ప్రస్థాన యాత్ర’ పేరుతో అక్టోబరు 20వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టబోతున్నాని ప్రకటించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ మొదలు పెట్టిన విధంగా చేవేళ్లలోనే తన పాదయాత్ర మొదలవుతుందని చెప్పారు. దాదాపు ఏడాది పాటు సాగే ఈ పాదయాత్రలో జీహెచ్ఎంసీ మినహాయించి తెలంగాణలోని మిగతా అన్ని ఉమ్మడి జిల్లాలు కవర్ చేస్తూ దాదాపు 90 నియోజకవర్గాలను తాకుతూ అన్ని పూర్తి చేసుకుని తిరిగి చేవెళ్లలోనే పాదయాత్రను ముగిస్తామని వైఎస్ షర్మిల వెల్లడించారు. ఈ పాదయాత్ర ద్వారా వైఎస్ఆర్ సంక్షేమ పాలనను మళ్లీ తీసుకొస్తామని ప్రజలకు భరోసా కల్పిస్తామన్నారు.
ఈ పాదయాత్రలో సమస్యలు వినడం, తెలుసుకోవడమే కాకుండా ఆ సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం కూడా పాదయాత్ర ఉద్దేశంగా పెట్టుకున్నామన్నారు. ప్రజల సమస్యలు వినడమే కాకుండా వారికి అండగా నిలబడతామని, వారి కోసం పోరాడుతామని, వారికి భరోసా కల్పించనున్నట్టు తెలిపారు. తమ పార్టీ సిద్ధాంతాలైన సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్రజలకు సేవ చేయడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వచ్చిందని, తామే ప్రత్యామ్నాయమని ఈ పాదయాత్ర ద్వారా భరోసా కలిగిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మోసపోయిన నిరుద్యోగులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారని, వారి తరఫున పోరాటం చేయడానికి ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతున్నామని చెప్పారు. ఈలోపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వని పక్షంలో పాదయాత్ర సమయంలో కూడా నిరుద్యోగ వారంలో భాగంగా మంగళవారం దీక్షలు కొనసాగుతాయని వైఎస్ షర్మిల తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ