ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. “సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి. నేడు తెలంగాణ ఒక వాస్తవం. ఎంతోమంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యం. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి. విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారు?, మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద. మీ హక్కుల కోసం పోరాటం చేయండి; మీ ప్రాంతానికి న్యాయం చేయండి. అంతేకాని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మీకు తగదు” అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
ముందుగా గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో విభజన కేసుపై ఏపీ ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మళ్ళీ ఎక్కడ అవకాశం దొరికినా ఉమ్మడి ఏపీ కావాలనే కోరతామని సజ్జల అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) మొదటి నుంచి పోరాటం చేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రానికే మా ఓటు అని, దానికోసం ఏ వేదిక దొరికినా కూడా, మళ్ళీ కలవడానికి అయితే మా పార్టీ గానీ, ప్రభుత్వం గానీ ఓటు దానికే వేస్తుందని, ఆ విషయాన్నే కోర్టులో అడ్వొకేట్ కూడా చేస్తుందన్నారు. కానీ 8 ఏళ్ల తర్వాత ప్రాక్టికల్ గా ఇంత జరిగాక, పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించవల్సి ఉంటుందని, ఆ విషయంలో మేమెప్పుడూ ముందు ఉంటున్నామని సజ్జల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE