తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదల అయ్యారు. హనుమకొండ కోర్టు గురువారం రాత్రి ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కాగా బండి సంజయ్ విడుదల సందర్భంగా.. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరీంనగర్లో 144 సెక్షన్ విధించారు. అలాగే నగరంలో సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక జైలు నుంచి విడుదలైన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎవరో వాట్సాప్ లో షేర్ చేస్తే, తనకేం సంబంధం? అని ప్రశ్నించారు. హిందీ పేపర్ ను తాను లీక్ చేశానని అంటున్నారని, అయితే ముందురోజు తెలుగు పేపర్ ను ఎవరు లీక్ చేశారు? అని నిలదీశారు. టీఎస్పీఎస్సీ లీకేజీ నుంచి విషయం డైవర్ట్ చేయడానికే తనను ఈ కేసులో ఇరికించారని, దానికి కారకుడైన మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలనీ డిమాండ్ చేశారు. వరంగల్ సీపీ తనపై చేసినవన్నీ నిరాధార ఆరోపణలేనని, ఆయనకు పేపర్ లీక్ కు, మాల్ ప్రాక్టీస్ కు తేడా తెలియదా? అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపుల ధోరణికి పాల్పడుతున్నారని, ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా తన బిడ్డ ఎమ్మెల్సీ కవితను జైలుకు పోకుండా కాపాడలేరని అన్నారు. నాడు ఉద్యమ సమయంలో మంత్రి హరీశ్ రావు అగ్గిపెట్టె దొరకలేదని డ్రామా చేశారని, మంత్రి కేటీఆర్ ను సీఎం చేస్తే.. బీఆర్ఎస్ నుంచి మొదట జంప్ అయ్యేది ఆయనేనని విమర్శించారు. ఇక బీజేపీ సంఘటిత శక్తి ఏంటో రేపటి ప్రధాని మోదీ సభలో చూపిస్తామని బండి సంజయ్ చెప్పారు.
కాగా నిన్న బండి సంజయ్ బెయిల్, కస్టడీ పిటిషన్లకు సంబంధించి గురువారం దాదాపు ఎనిమిది గంటల పాటు హోరాహోరీగా వాదనలు జరిగాయి. ఈ క్రమంలో చివరికి, రాత్రి పది గంటలకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. రూ.20 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరు జామీను కూడా సమర్పించాలని హనుమకొండ నాలుగో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఇన్చార్జి న్యాయమూర్తి రాపోలు అనిత తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, కేసు విచారణకు పోలీసులకు సహకరించాలని న్యాయమూర్తి షరతులు విధించారు. దీంతో నేటి ఉదయం బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదల అయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE