ఇటీవలే ప్రపంచబ్యాంకు అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చే విషయంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సైతం వెనక్కు తగ్గింది. గతంలో ప్రపంచబ్యాంకుతో కలిసి,అమరావతిలో మౌలిక సదుపాయాలు మరియు సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు కోసం 200 మిలియన్ డాలర్లు (రూ. 1,400 కోట్లు) రుణం ఇస్తామని ఏఐఐబీ హామీ ఇచ్చింది. ఇప్పుడు అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్ట్ నుండి 300 మిలియన్ డాలర్లు రుణం ఇచ్చే విషయంలో ప్రపంచబ్యాంకు వెనక్కు తగ్గడంతో, ఏఐఐబీ కూడ రుణ ప్రతిపాదనను విరమించుకుంది.
ఏఐఐబీ యొక్క ప్రతినిధి లారెల్ ఓస్ట్ఫీల్డ్, ఆర్థిక సహాయాన్ని ఉపసంహరించుకునే నిర్ణయం ఈ-మెయిల్ ద్వారా తెలియజేసినట్టు సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంఓ అధికారులు మాత్రం, కొత్త ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు అని పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వలనే ప్రపంచ బ్యాంకు రుణం విరమించుకుందని, అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్ట్ లో ప్రపంచ బ్యాంకు తో పాటు ఏఐఐబీ కూడ ఒక భాగమని, అందువలనే ఏఐఐబీ కూడ ఇటువంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చని భావిస్తున్నామని తెలిపారు. రాజధాని అంశంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తదుపరి కార్యాచరణ త్వరలోనే రూపొందిస్తుందని సమాచారం.
[subscribe]
[youtube_video videoid=ZmaFC4k8P1s]