అంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముందు నుంచి అనుకున్న పార్టీతోనే పొలిటికల్ జర్నీని ప్రారంభించారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. గురువారం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్లో సీఎం జగన్మోహన్ రెడ్డితో అంబటి రాయుడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పి అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమక్షంలో అంబటి వైసీపీలో చేరిపోయారు.
గత కొద్దిరోజులుగా అంబటి రాయుడు వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. జగన్తో కూడా అంబటి రాయుడు పలుమార్లు సమావేశమయ్యారు. ముందు నుంచి కూడా సోషల్ మీడియాలో అంబటి.. సీఎం జగన్, వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రశింసిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో అంబటి ఎప్పుడెప్పుడు వైసీపీ.లో చేరుతారా అని అందరూ ఎదురు చూస్తుండగా.. ఎట్టకేలకు వైసీపీ జెండా ఎత్తారు.
ఈ సందర్భంగా తాను రాజకీయాల్లో తన ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్లు అంబటి రాయుడు ప్రకటించారు. ముందు నుంచి కూడా సీఎం జగన్ అంటే తనకు ఇష్టమని, ఆయనంటే తనకు మంచి అభిప్రాయం ఉందని వివరించారు. జగన్ మార్క్ పాలిటిక్స్ కుల మతాలతో సంబంధం లేకుండా సాగడమే తనను ఆ పార్టీ పట్ల ఆకర్షితులను చేసిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ తనను ఆకట్టుకున్నాయని.. అందుకే ఆ పార్టీలో చేరానని అంబటి రాయుడు స్పష్టం చేశారు.
అయితే ఇప్పుడు అంబటి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే కొద్దిరోజులుగా అంబటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గుంటూరు నుంచి వైసీపీ తరుపున ఎంపీగా పోటీ చేస్తారని గుసగుసలు వినిపించాయి. అటు గుంటూరు అంబటి సొంత జిల్లా కావడమే కాకుండా.. అక్కడ ఆయన సామాజిక వర్గం అధికంగా ఉంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో అంబటిని గుంటూరు నుంచి పోటీ చేయిస్తే కచ్చితంగా గెలిచితీరుతారని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. మరి అంబటి పొలిటికల్ బ్యాటింగ్ ఎలా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ