ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో మళ్ళీ విజయం సాధించటానికి అధికార పార్టీ ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తోంది. ఇటీవలే ‘గడప గడపకు ప్రభుత్వం’ పేరుతో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరిస్తున్న పార్టీ నేతలు, తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయభేరి’ అనే పేరుతో 4 రోజుల బస్సు యాత్ర ప్రారంభించారు. శ్రీకాకుళంలో నేటి నుంచి ప్రారంభమవుతున్న ఈ యాత్రలో ఏపీ ప్రభుత్వంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు పాల్గొంటున్నారు. ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే సామాజిక న్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు.
ఈ యాత్రలో మంత్రులు.. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, కె.నారాయణ స్వామి, రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, పినిపె విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేశ్, మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా, తానేటి వనిత, విడదల రజని, మరియు ఉషశ్రీ చరణ్ తదితరులు పాల్గొంటున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రారంభమవుతున్న ఈ యాత్ర అనంతపురంలో ముగియనుంది. ఈ యాత్రలో భాగంగా 26న విజయనగరంలో, 27న రాజమహేంద్రవరంలో, 28న నరసరావుపేటలో చివరిగా 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. రాష్ట్ర కేబినెట్లో బీసీలు, ఎస్సీలు, షెడ్యూల్డ్ తెగలకు అండగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ ఉద్యమ విజయాన్ని తెలియజేయటానికి బస్సు యాత్ర చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ