ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు ఎంతోకాలంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వారు ఒకసారి ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పేరుతొ మహా పాదయాత్రను నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో ఈసారి కూడా అదే తరహాలో ‘వాకథాన్’ నిర్వహించాలని రాజధాని ప్రాంత రైతులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈసారి రూట్ మార్చనున్నారు. సెప్టెంబర్ 12 నుంచి అమరావతిలో మొదలుపెట్టి శ్రీకాకుళంలోని అరసపల్లి ఆదిత్యుడి ఆలయం వరకూ మహా పాదయాత్రను చేపట్టనున్నారు. ఈ మేరకు అమరావతి ఐకాస కన్వీనర్ శివారెడ్డి ప్రకటించారు.
గురువారం అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, పలు విధాలుగా తమ నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. తాము చేస్తున్న ఆందోళన 1000 రోజులకు చేరుకుంటున్న సందర్భంగా.. సెప్టెంబర్ 12న మందడం గ్రామంలో లేదా వెంకటపాలెంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇన్ని రోజులు తమ ఉద్యమానికి మద్దతిచ్చిన రాజకీయ పార్టీలతో నేతలు సంప్రదింపులు జరుపుతున్నామని, రూట్ మ్యాప్ను ప్లాన్ చేసే పనిలో రైతుల జాయింట్ యాక్షన్ కమిటీ నిమగ్నమైందని, పాదయాత్రకు సంబంధించి మరో రెండు రోజుల్లో సమగ్ర నివేదిక డీజీపీకి అందజేస్తామని రైతు నేతలు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY