ఇకపై అమరావతి అందరిదీ అని, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో సామాజిక అమరావతిగా అవుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలోని ఆర్-5 జోన్లో పేదలకు (శుక్రవారం, మే 26, 2023) ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) ఆధ్వర్యంలో మొత్తం 51 వేల 392 మంది కోసం 1,402.58 ఎకరాలలో 25 లే ఔట్లను సిద్ధం చేసింది. కాగా ఆర్-5 జోన్లో ఇళ్ళ పట్టాల పంపిణీకి సుప్రీంకోర్టు ఇటీవలే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నేడు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని సీడ్ యాక్సిస్ రోడ్ పక్కనే ఏర్పాటు చేసిన వేదిక వద్ద ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు’ పథకం కింద 50,793 మంది పేదలకు పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, జోగి రమేష్, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం జగన్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- రాజధాని అంటే ఏ ఒక్కరికో కాదు, అందరిదీ.
- పేదలకు కూడా ప్రాతినిథ్యం ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుంది.
- దీనికోసం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించాం.
- అందుకే సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలలో 25 లే ఔట్లు సిద్ధం చేశాం.
- ఈరోజు మొత్తం 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం.
- మరో వారంలో మూడు పద్ధతుల్లో ఇళ్ళు కట్టించే కార్యక్రమం మొదలుపెడతాం.
- సొంతంగా ఇళ్ళు నిర్మించుకునేవారికి రూ.1,80,000 వారి ఖాతాల్లో వేస్తాం.
- అలాగే రెండో విధానంలో నిర్మాణ కూలీ ఖర్చును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం.
- రూ.7 – 10 లక్షలు విలువ కలిగిన ఇంటి స్థలాన్ని ఇస్తున్నాం.
- సామాజిక అమరావతే.. మనందరి అమరావతి.
- వైఎస్సార్ జయంతి సందర్భంగా.. జులై 8న ఇళ్ళు కట్టించే కార్యక్రమం చేపడతాం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE