ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ‘జగనన్న వసతి దీవెన’ పథకం మొదటి విడత కింద రూ.1,048.94 కోట్ల నిధులు విడుదల చేశారు. 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి జగనన్న వసతి దీవెన పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,048.94 కోట్లను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. ముందుగా జగనన్న వసతి దీవెన పథకం ద్వారా వసతి, భోజన ఖర్చుల కోసం రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సంవత్సరం ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు చదివే వారికీ రూ.20 వేలు చెల్లించనున్నారు. అర్హులైన విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంకు ఖాతాల్లో రెండు విడతలుగా ఈ నగదును జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నేడు మొదట విడత చెల్లింపులు జరగగా, రెండో విడత చెల్లింపులు డిసెంబర్ నెలలో జరగనున్నాయి.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఉన్నతమైన చదువులే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని చెప్పారు. చదువుల దీపాలు వెలిగిస్తేనే ఈ తరంతో పాటుగా భావి తరాల తలరాతలు మారుతాయని ఈ ప్రభుత్వం గట్టిగా నమ్ముతుందని చెప్పారు. ఈ రోజు 10,89,302 మంది విద్యార్థులకు మంచి జరిగేలా వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా రూ.1048.94 కోట్లు జమ చేస్తున్నామని అన్నారు. మరోవైపు పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ స్పందిస్తూ రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని, విద్యార్థి భవిష్యత్ కోసం తన కన్న ఎక్కువగా ఆలోచించే వారు ఎవ్వరూ వుండరని అన్నారు. పరీక్షల నిర్వహణలో అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదని, ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే వదిలేసిందని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరిగాయి, జరుగుతున్నాయి, మరికొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు మార్కులు లేకుండా పాస్ అనే ఒక సర్టిఫికెట్ తో బయటపడితే ఎలా అని, వారి భవిష్యత్తు మరో 50 సంవత్సరాలు ఈ సర్టిఫికెట్స్ మీదనే ఆధారపడుతుందని అన్నారు. పరీక్షలు జరిగే రాష్ట్రాల్లో మార్కులు, మంచి పర్సెంటేజ్, ర్యాంకులుతో గొప్పగా ఉండే విద్యార్థులకు, పరీక్షలు జరగని రాష్ట్రాల్లో పాస్ సర్టిఫికెట్ తో వచ్చే విధ్యార్దులలో ఎవరికీ మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయో ఆలోచన చేయాలని కోరారు. పదోతరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుని నిర్వహిస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ