ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4, బుధవారం నాడు కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి – పెద్దనందులూరు పంచాయతీల మధ్య ఈ స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్ 26వ తేదీన కడప స్టీల్ప్లాంట్ కు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. 2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం 100% పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వమే పెట్టనుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే 2019-20 బడ్జెట్లో స్టీల్ప్లాంట్ నిర్మాణం కోసం రూ.250 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇబ్రహీంపట్నంలో గల ఇన్క్యాప్ కార్యాలయాన్ని ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ రిజిస్టర్ కార్యాలయంగా ప్రభుత్వం పేర్కొంది. అంతేగాక పరిశ్రమశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, గనుల శాఖ కార్యదర్శి కె.రామ్ గోపాల్ లను డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
[subscribe]