ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ విషయమై ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య మొదలైన రగడ రోజు రోజుకూ ముదురుతోంది. ఇప్పటికి 12 సార్లు చర్చలకు వెళ్లినా ఫలితం లేదని ఉద్యోగుల జేఏసీ నేత బండి శ్రీనివాసరావు మండిపడ్డారు. పీఆర్సీ ఉద్యమానికి అన్ని సంఘాలు మద్దతిస్తున్నాయన్నారు. ఫిట్మెంట్ ఇంత తగ్గిస్తారనుకోలేదన్నారు. హెచ్ఆర్ఏలోనూ అన్యాయం జరిగిందని బండి శ్రీనివాసరావు వాపోయారు. ఏ లెక్కల ప్రకారం పీఆర్సీ ఇచ్చారో చెప్పాలన్నారు. పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని బండి శ్రీనివాసరావు డిమాండ్ చేసారు. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఈ దీక్షల్లో పాల్గొన్న బండి శ్రీనివాస రావు మాట్లాడారు.
మరోవైపు పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో.. విజయవాడ లోని ధర్నాచౌక్ వద్ద రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిపై మాట తప్పిందని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సానుకూలతతో వ్యవహరించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి తెలిసేలా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరూ రిలే దీక్షలు చేస్తున్నామని నేతలు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరిస్తేనే చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. అలాగే, పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకునేదాకా నిరసనలు కొనసాగుతాయని ఉద్యోగులు స్పష్టం చేశారు. ఈ రిలే దీక్షల్లో వామపక్ష కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ