ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో రోడ్ షోలు, బహిరంగ సభలను నియంత్రిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను హైకోర్టు కొట్టివేసింది. ఈ జీవో ప్రతిపక్షాల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మరియు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. కాగా టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గతేడాది ప్రకాశం జిల్లా కందుకూరు మరియు గుంటూరులో నిర్వహించిన బహిరంగ కార్యక్రమాల్లో ప్రమాదవశాత్తూ తొక్కిసలాట జరిగి పలువురు మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై, కూడళ్లలో సభలు నిర్వహించకూడదని ఆదేశిస్తూ ఈ ఏడాది జనవరి 2న జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిన విషయం విదితమే.
ఈ జీవో ప్రకారం రాష్ట్రంలో రాజకీయ పార్టీలు రోడ్లపై బహిరంగ సభలు నిర్వహించకూడదనే నిబంధన వర్తిస్తుంది. అయితే రాష్ట్రంలో ప్రతిపక్షాలను కట్టడి చేయడానికే ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిందని, దీనిని కొట్టివేయాలని కోరుతూ విపక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ జీవోను సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మరియు మరికొందరు ఇతర ప్రజా సంఘాల నేతలు వేర్వేరుగా పిటీషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్లపై జనవరి 24న విచారణ ప్రారంభించిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఈరోజు జీవో 1ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE