తెలంగాణ వైద్యారోగ్యశాఖలో త్వరలోనే మరో వెయ్యికి పైగా కొత్త సిబ్బంది చేరనున్నారు. మొత్తం 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో పనితీరుపై గురువారం ఆయన వైద్యశాఖ అధికారులతో నూతన సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డీహెచ్ శ్రీనివాస రావు, టీవీవీపీ ఇన్చార్జి కమిషనర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈ నెల 22న 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నామని, ఇప్పటికే 65 మందికి ప్రొఫెసర్లుగా, మరో 210 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో వైద్య రంగం అద్భుతంగా వెలుగొందుతోంది, ఆయన ఆశించినట్లు జిల్లాకొకటి చొప్పున మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే దేశంలో వైద్య విద్యకు, నాణ్యమైన వైద్యానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్ అవుతుందని, వైద్యం, వైద్య విద్యకు తెలంగాణ హబ్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా గతేడాది ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకొన్నామని, అలాగే ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవనున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇక వైద్య కళాశాలల్లో విద్యార్థుల మానసిక స్థితిని నిరంతరం గమనించుకుంటూ ఉండాలని, అవసరమనిపిస్తే తగిన కౌన్సెలింగ్ ఇవ్వాలని, యోగా, ప్రాణాయామం వంటి తరగతులను ప్రారంభించాలని ఆదేశించారు. మొత్తం 800 మంది పీజీ సీనియర్ రెసిడెంట్లను జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు, వైద్య విధాన పరిషత్ ప్రధాన దవాఖానలకు ఇచ్చామని, అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన 900 మంది తెలంగాణ విద్యార్థులకు ఏడాది ఇంటర్న్షిప్ కోసం అడ్మిషన్లు ఇచ్చామని కూడా గుర్తు చేశారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని, సిజేరియన్లు తగ్గాయని తెలిపారు. ఇక దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది, వైద్యులేనని, వారిని ఆ దిశగా నడిపిస్తున్న అధికారులకు అభినందనలు అని మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE