ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 17 మంది బృందంతో దావోస్ పర్యటనకు శుక్రవారం బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనపై అనూహ్యంగా రకరకాల అపోహలు, వివాదాలు చుట్టుముట్టాయి. దానికి కారణం అధికారికంగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి శుక్రవారం సాయంత్రానికి దావోస్ సిటీలో ల్యాండ్ అవుతారని తెలిపారు. అయితే ఆయన దావోస్ లో కాకుండా లండన్లో ల్యాండ్ అవడం విశేషం. దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సీఎం జగన్ ప్రైవేటు పనిపై వెళ్ళారా? లేక అధికారికంగా వెళ్ళారా? అని ప్రశ్నించింది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా దీనిపై పలు విమర్శలు చేశారు.
దీంతో అధికార పార్టీ స్పందించింది. ఈ వివాదానికి సంబంధించి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. మంత్రి బుగ్గన చెప్పిన దాని ప్రకారం.. శుక్రవారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్లో ఆగింది. అయితే అక్కడ ఎయిర్ట్రాఫిక్ విపరీతంగా ఉండటం మూలాన ఇంధనం నింపుకునే ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగింది. ఫలితంగా లండన్ ఎయిర్పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యింది.
కాగా లండన్లో కూడా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో, జురెక్లో ల్యాండ్ అవడానికి ప్రయాణ షెడ్యూల్ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయింది. దీంతో మళ్లీ ల్యాండింగ్ కోసం అధికారులు రిక్వెస్ట్పెట్టారు. దీనిని స్విట్జర్లాండ్లోని భారత ఎంబసీ అధికారులు, లండన్లోని భారత దౌత్య అధికారులకు సమాచారం అందించగా, వారు నేరుగా ముఖ్యమంత్రి బృందంతో చర్చించి, లండన్లోనే వైఎస్ జగన్కు బస ఏర్పాట్లు చేశారు. అనంతరం సీఎం జగన్ ఈ రోజు దావోస్ చేరుకున్నారని స్పష్టం చేశారు. అయితే వాస్తవం ఇది కాగా, ప్రతిపక్షాలు అనవసరంగా ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బుగ్గన విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF