భవన నిర్మాణ కార్మికుల కోసం నవంబరు 3న విశాఖలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. రాష్టంలో ఇసుక కొరత దృష్ట్యా, భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులకు నిరసనగా పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మద్దిలపాలెంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, పవన్ ఈ లాంగ్మార్చ్ను మొదలుపెట్టారు. రామాటాకీస్ మీదుగా సాగి, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ లాంగ్ మార్చ్ కొనసాగనుంది. పవన్ కళ్యాణ్ అన్ని విపక్ష పార్టీలను ఆహ్వానించినప్పటికీ కేవలం టీడీపీ పార్టీ మాత్రమే ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించింది. టీడీపీ తరఫున సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు, అయ్యన పాత్రుడు, ఇతర నేతలు ఈ లాంగ్మార్చ్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు, జనసేన కార్యకర్తలు, అభిమానులు,ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. లాంగ్మార్చ్ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు.
బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ విశేషాలు:
- భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నాం. ఒక్కో కార్మికుడికి రూ.50 వేల సాయం, మృతిచెందిన 36 మంది కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేయాలి
- రెండు వారాల్లో గనుక ప్రభుత్వం స్పందించకపోతే అమరావతి వీధుల్లో నడుస్తా. పోలీసులను పెట్టినా, ఆర్మీని పిలిపించిన ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్నారు
- భవన నిర్మాణ కార్మికుల కష్టం ఆవేదన నా మనసుని తాకాయి
- ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ప్రజలు రోడ్లమీదకు ఎందుకు వస్తున్నారో ఆలోచించుకోవాలి
- ప్రజలు సమస్యలతో రోడ్డు మీదకు వచ్చారంటే ప్రభుత్వం విఫలమైనట్టే
- రాజకీయ నాయకులంతా బాధ్యతగా వ్యవరించి ఉంటే జనసేన పెట్టే అవసరమే లేకపోయేది, సీఎం జగన్ అద్భుత పాలన అందిస్తే నేను మళ్లీ సినిమాలు చేసుకుంటా
- కన్నబాబును రాజకీయాల్లోకి తెచ్చిందే మేము, ఇప్పుడు ఆయన నన్ను విమర్శిస్తున్నారు
- నేను ఏ పార్టీకి దత్తపుత్రుడిని కాదు, కష్టాల్లో ఉన్న ప్రజలకు మాత్రమే దత్తపుతుణ్ణి
- ఈ ప్రభుత్వం కూల్చివేతలతో మొదలెట్టారు, ఎంతవేగంగా నిర్మాణాలను కూల్చివేశారో ప్రభుత్వం కూడా అంతేవేగంగా కూలిపోతుంది
- ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా నీతులు చెప్పి, నన్ను విమర్శిస్తున్నాడు. అలాంటి ఫ్రైడే మ్యాన్ కి నన్ను విమర్శించే నైతిక హక్కు ఉందా
- తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యపై అక్కడి పార్టీలన్నీ కలిసి పోరాడుతున్నాయి, ఇక్కడ పార్టీలన్నీ కులాల వారీగా విడిపోయాయి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా రావాలి
- ప్రత్యేక హోదా అంశాన్ని అన్ని పార్టీల వదిలేసినా నేను మాత్రం వదిలిపెట్టలేదు
- భవన నిర్మాణ కార్మికుల ఉపాధి లేకపోవడంతో, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దెబ్బతినే విధానాన్ని త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా.
[subscribe]