పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసాని’ తుఫాన్ దిశను మార్చుకుని ఏపీ వైపుగా దూసుకొస్తోంది. నరసాపురం, కాకినాడ, విశాఖకు సమాంతరంగా ఇది సముద్రంలో ప్రయాణం చేయనుంది. ఈ రోజు ఇది కాకినాడ తీరాన్ని తాకవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. కాకినాడ తీరాన్ని తాకిన తర్వాత తిరిగి మళ్లీ కాకినాడ-విశాఖపట్నం మధ్య సముద్రంలోకి రానుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం గణితం పేపర్ -1ఎ, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పరీక్షలను వాయిదా వేశారు.
అలాగే దక్షిణ మధ్య రైల్వే దాదాపు 37 రైళ్లను రద్దు చేసింది. విజయవాడ జంక్షన్ కేంద్రంగా పయనించనున్న పలు రైళ్లను రద్దుచేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఏవియేషన్ అధికారులు సుమారు 25 వరకు విమానాలను పాక్షికంగా రద్దు చేశారు. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రాలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 85 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు ప్రకటించారు. గరిష్టంగా 110 కి.మీ వేగంతో గాలులు వీయొచ్చని హెచ్చరించారు. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు చేపల వేటను నిలిపివేయాలని ఇప్పటికే అధికారులు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ