ఏపీ టీడీపీ రాజకీయంలో గతంలో లేని భిన్న పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎవరికి ఎక్కడ టికెట్ దక్కుతుందో, అసలు టికెట్ దక్కుతుందో లేదో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులోనూ విశాఖపట్నంలో తెలుగు దేశం పార్టీ పరిస్థితి అయితే మరీ చిత్రంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ తమకే టికెట్ అని ధీమాగా ఉన్న నేతలంతా.. జనసేన పొత్తు తర్వాత అయోమయంలో పడ్డారు. దీనికి తోడు బీజేపీ కూడా టీడీపీ, జనసేన కూటమితో కలిసినడుస్తుందన్న మాటలతో అసలు టికెట్ దొరుకుందా లేదా అన్న అనుమానంలో పడుతున్నారు.
విశాఖ నుంచి ఎంపీగా 2024లో పోటీ చేయాలని హిందూ పురం ఎమ్మెల్యే , హీరో బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్ ఎప్పటి నుంచో గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమి.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. విశాఖ లోక్ సభ సీటును వదులుకోవాల్సి ఉంటుంది. అక్కడ సీటు దొరకదన్న అభిప్రాయంతో విశాఖ నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం కోసం శ్రీ భరత్ వెతుకుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా భీమిలి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాలని శ్రీ భరత్ అనుకున్నా.. అది పొత్తులో భాగంగా జనసేనకు పోతుంది. పోనీ విశాఖ సౌత్ నుంచి పోటీ చేద్దాం అనుకుంటే అక్కడ కూడా తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి పోటీగా ఉన్నారు. ఇక ఇప్పుడు విశాఖ నార్త్ ఒకటే శ్రీ భరత్ ముందున్న ఆప్షన్.
దీంతోనే శ్రీ భరత్ విశాఖ నార్త్ నుంచి బరిలోకి దిగాలని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా లోకేష్ శంఖారావం సభలో శ్రీ భరత్ చేసిన కామెంట్లు చూస్తే కచ్చితంగా ఉత్తర విశాఖ నుంచే శ్రీ భరత్ పోటీ చేస్తారన్న నమ్మకం ఏర్పడుతుందని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్టేజ్ మీద ఉండగానే శ్రీ భరత్ ఆయన ఉన్నా లేనట్లే మాట్లాడిన మాటలు అవే కన్ఫమ్ చేశాయని అంటున్నారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలకు గంటా శ్రీనివాస్ అందుబాటులో లేకపోయినా తాను , తెలుగుదేశం పార్టీ జనాలకు అండగా ఉంటామని శ్రీ భరత్ సభాముఖంగా చెప్పుకొచ్చారు. టీడీపీ యువనేత నారా లోకేష్ సమక్షంలోనే గంటాని అలా ఉత్తరానికి సంబంధం లేని నేతగా శ్రీ భరత్ మాట్లాడటమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎంత తాను నిలబడాలని అనుకున్నా సీనియర్ నేతను అలా తీసిపారేయడం ఏం బాగోలేదని కొంతమంది అంటుంటే.. శ్రీ భరత్ అన్న మాటలు వాస్తవేమని..గంటా నిజంగానే ఆ ప్రాంతవాసుల్ని పట్టించుకోలేదని మరికొంతమంది అంటున్నారు.
నిజమే..నాలుగేళ్ల పాటు నిజంగానే గంటా శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు అక్కడ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆయన గెలిచినా కూడా ఎందుకని ఇన్నాళ్లు సైలెంట్ గానే ఉండిపోయారని.. ఎన్నికల ముందే ఎందుకు యాక్టివ్ అవుతున్నారని ప్రశ్నించేవాళ్లూ కూడా లేకపోలేదు. అంతెందకు నార్త్ లో టీడీపీని గంటా ఇన్నేళ్లుగా గాలికి వదిలేసారనే ఆలోచన టీడీపీ హైకమాండ్లోనూ ఉంది.గంటా విషయంలో టీడీపీ అధిష్టానం కూడా ఇలాగే ఆలోచిస్తుందని..అది శ్రీ భరత్ బయటపెట్టారన్న వాదన వినిపిస్తోంది. అందుకే నారా లోకేష్ ఆ మాట అనకపోయినా.. ఆయన ఎదుటే తోడల్లుడు ఆ మాటను అందరి ముందూ అన్నారన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది.
మరోవైపు గంటా శ్రీనివాసరావు ఈసారి విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయరని వేరే నియోజకవర్గం చూసుకుంటున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. గంటా అయితే భీమిలి లేదా చోడవరం అసెంబ్లీ స్థానాల గురించి అధిష్టానాన్ని అడుగుతున్నారని అంటున్నారు. కానీ గంటా గెలిచాక యాక్టివ్గా ఉండరన్న నెగిటివ్ టాక్ మూటగట్టుకోవడంతో..ఈ సారి గంటా విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. కానీ శ్రీ భరత్ మాత్రం విశాఖ నార్త్ ప్రజలకు తాను అండగా ఉంటాను అని చెప్పి ఇన్ డైరక్టుగా అక్కడ కర్చీఫ్ వేసేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE