దివంగత సీఎం ఎన్టీఆర్ శతజయంతి ఏడాది సందర్భంగా ఆయన స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణెం విడుదల చేసింది. ఈ నాణేన్ని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటంబ సభ్యుల్ని ఆహ్వానించారు. అలాగే మంగళవారం నుంచి ఈ కాయిన్ ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఎన్టీఆర్ స్మారక వంద రూపాయల కాయిన్ ఎక్కడెక్కడ దొరుకుతుందన్న వివరాల్ని కేంద్ర ప్రభుత్వ ముద్రణా సంస్థ మింట్ వెల్లడించింది.
రాష్ట్రపతి విడుదల చేసిన ఎన్టీఆర్ కాయిన్ను జనానికి కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు మింట్ ప్రకటన విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్లో ఈ నాణెం ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలిపింది. అలాగే ఆన్ లైన్లోనూ ఈ కాయిన్ను ఎలా తెప్పించుకోవచ్చన్న వివరాల్ని మింట్ ఛీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు వెల్లడించారు. ఇందులో ఆయన.. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఈ కాయిన్ను కొనుగోలు కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.
ఆన్లైన్లో ఎన్టీఆర్ కాయిన్ తెప్పించుకోవాలనుకునే వారు మింట్ అధికారి వెబ్ సైట్లో ఆర్డర్ చేసేందుకు వీలు కల్పిస్తున్నారు. ఈ కాయిన్ కావాల్సిన వారు మింట్ వెబ్ సైట్ https://indiagovtmint.in/en/commemorative-coins/ లోకి వెళ్లి దీన్ని ఆర్డర్ చేసుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ కాయిన్ కోసం నిర్ణీత మొత్తం ఆన్ లైన్లోనే చెల్లించి ఆర్డర్ చేసుకునే వీలుంది. అలాగే ఆఫ్ లైన్లో కూడా అందుబాటులో ఉంచుతున్నారు.
హైదరాబాద్లోని సైఫాబాద్, చర్లపల్లి మింట్ సేల్ కౌంటర్లలో ఎన్టీఆర్ స్మారక కాయిన్ను విక్రయిస్తారు. ఈ కాయిన్కు ఉన్న డిమాండ్, తయారీ సమయం వంటి కారణాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి ఒక్కొక్కరికి ఒక్కో కాయిన్ మాత్రమే విక్రయించనున్నట్లు మింట్ అధికారులు తెలిపారు. డిమాండ్ తగ్గాక ఎన్ని కాయిన్లు కావాలంటే అన్ని కాయిన్లు విక్రయించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అభిమానులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE