టికెట్ ఆశించి చివరకు అది దక్కకపోతే నేతలు చేసే రచ్చ అంతాఇంతా కాదు. ఎంతో ఖర్చు పెట్టామని.. తమకే సీటు కేటాయించకపోతే ఎలా అని లబోదిబోమంటారు. అలాంటిది ముందుగా అభ్యర్థిగా నువ్వే అని ప్రకటించి.. ప్రచారం చేసుకోమని.. వీధివీధినా తిరగమని చెప్పి.. గోడలకు పోస్టర్లు అంటించుకోని.. పాంప్లెట్లు ప్రింట్ చేయించుకున్న తర్వాత అంతా తూచ్ అంటే ఎలా ఉంటుంది? ఒళ్లు మండిపోతుంది కదు..! అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల కోపం కట్టలు తెంచుకుంటోంది. రోజురోజుకు చంద్రబాబుపై ఆవేశం మాటల రూపంలో నిరసనల మంటల్లో తాండవిస్తోంది. ఎన్నికల అభ్యర్థుల మొదటి లిస్ట్ను టీడీపీ 94 మందితో గత ఫిబ్రవరి 24న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో అనపర్తి నుంచి నల్లమిల్లి పేరే ఉంది. అయితే మూడు రోజుల క్రితం రిలీజ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్లో కమలం పార్టీ నేత శివరామకృష్ణరాజు పేరును అనపర్తి నుంచి ప్రకటించారు. ముందుగా టీడీపీ ప్రకటించిన నల్లమిల్లి పేరు పొత్తులో భాగంగా పక్కనపెట్టేశారు. ఇది నల్లమిల్లి ఆగ్రహానికి కారణమైంది.
రెడ్డిలతే హవా:
ఈ నెల రోజుల పాటు నల్లమిల్లి నియోజకవర్గంలో బాగా తిరిగారు. పేరు ప్రకటించిన నాటి నుంచి ప్రచారం జోరు స్పీడ్ పెంచారు. నిజానికి నల్లమిల్లి కుటుంబం 42 ఏళ్లుగా టీడీపీలో ఉంది. అక్కడ అభ్యర్థిని మార్చే ప్రసక్తే లేదని ఆ పార్టీ ఇదివరకే స్పష్టం చేసింది. ఇక అనపర్తిలో టీడీపీ ఐదుసార్లు గెలిచింది… బీజేపీ ఒక్కసారి కూడా గెలవకలేదు. పైగా ఐదు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో రెడ్డి కులం మాత్రమే గెలుస్తూ వస్తోంది. ఇదంతా నల్లమిల్లికి అనుకూలంగా ఉన్న అంశాలు. అందుకే టీడీపీ ఆయనకే అవకాశం ఇచ్చింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా చివరిలో బీజేపీ అభ్యర్థి పేరును ప్రకటించారు. బీజేపీ తన బలహీనతలను పరిగణనలోకి తీసుకోకుండా రెడ్డియేతర అభ్యర్థితో ముందుకు సాగుతుందని.. ఇది వైసీపీకి లాభం చేకూరే ప్రమాదం ఉందని అనపర్తిలో తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఎందుకిలా జరిగింది?
వైసీపీతో కుమ్మక్కై టీడీపీ నుంచి బీజేపీ సీటు లాక్కుందన్న ప్రచారం ఓవైపు సాగుతుండగా.. మరవైపు నల్లమిల్లి అనుచరులు మాత్రం తెలుగు దేశం జెండాలను తగలబెడుతున్నారు. టికెట్ ఇచ్చేసి లాస్ట్లో పేరును మార్చడం సరికాదంటున్నారు. అటు నల్లమిల్లి సైతం స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసేందుకు సిద్థమవుతున్నట్టు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. కుటుంబంతో కలిసి ప్రజల్లోకి వెళ్తానని ఆయన ఇప్పటికే కుండబద్దలు కొట్టారు. ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ చేస్తానని, టీడీపీకి మద్దతివ్వబోనని, బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వాలని ఓటర్లను కోరబోనని ప్రకటించడం చంద్రబాబును షాక్కు గురి చేసింది. నల్లమిల్లి బహిరంగ తిరుగుబాటు రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY