నివర్ తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 450 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నివర్ తుఫాన్ నవంబర్ 25 తేదీ సాయంత్రం మమాళ్ల పురం-కరైకల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ నివర్ తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలపై భారీ ప్రభావం చూపే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే గురువారం నాడు తెలంగాణలోను కూడా మోస్తరు వర్షాలు కురవవచ్చని తెలిపారు. మరోవైపు నివర్ తుఫాన్ నేపథ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్గాబా సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా విద్యుత్తు, వైద్యశాఖ, రెవిన్యూ, పౌరసరఫరాలు శాఖలు అప్రమత్తంగా ఉండి, తుఫాను వలన ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ప్రభావిత రాష్ట్రాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా తమిళనాడులో పలు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను మోహరిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ