ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడింది. లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, కొత్త కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సంధూలతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్ ప్రెస్మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ను రాజీవ్ కుమార్ ప్రకటించారు.
ఈసారి మొత్తం 7 విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి దశ.. ఏప్రిల్ 26న రెండో దశ.. మే 7న మూడో దశ.. మే 13న నాలుగో దశ.. మే 20న అయిదో దశ.. మే 25న ఆరో దశ.. జూన్ 1న ఏడో దశ ఎన్నికలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడతలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకు.. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇక ఏపీలో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలించనున్నారు. 29 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇక మే 13న ఏపీలో ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడవ్వనున్నాయి.
ఎన్నికలకు సంబంధించి పకడ్బంధీగా ఏర్పాట్లు చేశామని ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈసారి దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని అన్నారు. ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలను వినియోగిస్తున్నామని.. 1.5 కోట్ల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుషులు 49.7 కోట్ల మంది, మహిళలు 47.1 కోట్ల మంది, ట్రాన్స్జెండర్లు 48 వేల మంది ఉన్నారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE