టీడీపీ-జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ చేరడం కూడా ఖాయమైపోయింది. కొన్నాళ్లుగా సాగుతున్న పొత్తు పొడుచుకొస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఢిల్లీకి పయనమైన నేపథ్యంలో నేడో, రేపో సీట్ల సర్దుబాటు కూడా తేలిపోనుంది. 5 ఎంపీ సీట్లు, 8 అసెంబ్లీ స్థానాలు లేదా, 4 ఎంపీ సీట్లు, 1 రాజ్యసభ, 8 అసెంబ్లీ సీట్లు ఏదో ఒకటి ఖరారు చేసుకునే ఉద్దేశంలో టీడీపీ, బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ నేతలు 11 అసెంబ్లీ స్థానాలు పట్టుబడుతున్నారు. చంద్రబాబు 5 లేదా 8 వరకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ పెద్దల పిలుపుతో బాబు హస్తిన వెళ్లడంతో సీట్ల లెక్కకూడా తేలిపోనుంది.
ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా టీడీపీ-జనసేన తీవ్రస్థాయిలో రాజకీయాలు చేస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా అధికారికంగా జతకట్టనుండడంతో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. అయితే, పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు లభిస్తాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. గత ఎన్నికల్లో ఆంధ్రలో ఆ పార్టీకి ఒక శాతంలోపే ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ బలానికి మించి సీట్లు ఇస్తే.. తర్వాత గెలవలేకపోతే మధ్యలో వైసీపీ లాభపడుతుందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ 13 అసెంబ్లీ సీట్లు ఇవ్వగా.. ఆ పార్టీ అభ్యర్థులు నాలుగు చోట్లే గెలవగలిగారు. ఈసారి విజయావకాశాలు కలిగిన అభ్యర్థులు ఉన్నచోటే బీజేపీకి సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది.
ఈక్రమంలో బీజేపీ అధిష్ఠానం కూడా రాష్ట్ర నాయకులతో సమాలోచనలు చేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ఢిల్లీలో రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ పోటీచేసే అసెంబ్లీ, లోక్సభ స్థానాలపై గురువారం చంద్రబాబుతో జరిపే చర్చల్లో అవగాహనకు వస్తే.. శుక్ర, శనివారాల్లో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పొత్తుతో పాటు అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇటీవల పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్జీ సమక్షంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పొత్తుపై చర్చించి వేర్వేరు ప్రతిపాదనలు సమర్పించగా.. బుధవారం వాటిపై షా, నడ్డా చర్చలు జరిపినట్లు తెలిసింది.
మరోవైపు.. బీజేపీ కోరుతున్న సీట్లలో ఆ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై టీడీపీ నాయకత్వం ఇప్పటికే సర్వే కూడా చేయించింది. ఆ ఫలితాలు కొందరికి అనుకూలంగా, ఇంకొందరికి ప్రతికూలంగా వచ్చాయి. 3 అసెంబ్లీ సీట్లు, 3 లోక్సభ సీట్లు బీజేపీకివ్వాలని కొందరు టీడీపీ ముఖ్య నేతలు చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు. వారు ప్రతిపాదించిన లోక్సభ స్థానాల్లో నరసాపురం, తిరుపతి (ఎస్సీ), అరకు (ఎస్టీ) ఉన్నాయి. అయితే బీజేపీ నాయకులు ఐదు లోక్సభ సీట్లు.. నరసాపురం, రాజమహేంద్రవరం, ఏలూరు, రాజంపేట, తిరుపతి కోరుతున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఐదు ఎంపీ సీట్లు ఉంటే అందులో నాలుగు పొత్తులో బీజేపీకి, జనసేన (కాకినాడ)కు వెళ్తాయని, తమకు ఒకటి (అమలాపురం-ఎస్సీ) మాత్రమే దక్కుతుందని.. ఇది తమకు అంగీకారం కాదని టీడీపీ నాయకుడొకరు స్పష్టం చేశారు. రాజంపేట లోక్సభ స్థానం పరిధిలో ముస్లింల సంఖ్యాబలం బాగా అధికమని.. అక్కడ బీజేపీకి విజయావకాశాలు తక్కువని.. పైగా తమ అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఇబ్బంది అని రాయలసీమ టీడీపీ నేతలు వాదిస్తున్నారు. అలాగే బీజేపీకి ఐదు అసెంబ్లీ సీట్లు ఇవ్వొచ్చని వినవస్తోంది. అయితే ఆ పార్టీ 11 అసెంబ్లీ స్థానాలు ఆశిస్తున్నట్లు తెలిసింది. అతిత్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE