ఆంధ్రప్రదేశ్లోని కడప పార్లమెంట్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచే బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. వైఎస్ కుటుంబానికే చెందిన అవినాష్ రెడ్డితోనే షర్మిల తలపడనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే కడప లోక్సభ స్థానం సహా ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో తాజాగా జరిగిన కడప జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఆదేశిస్తే ఎవరైనా.. ఎప్పుడైనా.. ఏ స్థాయిలోనున్న నాయకుడైనా పోటీ చేయాల్సిందేనని, అవసరమైతే త్యాగాలకైనా సిద్ధపడాలని తేల్చిచెప్పారు. ‘ఇందుకు నేనూ అతీతం కాదు. నేనైనా.. రఘువీరారెడ్డి అంకులైనా.. పళ్లంరాజుగారైనా.. పార్టీకి చెందిన పెద్దలూ.. చిన్నవాళ్లూ అధిష్ఠానం ఆదేశాలను శిరసావహించాల్సిందే’ అని స్పష్టం చేశారు.
అయితే.. అంతకుముందు కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీచేయాలని ఆ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నేతలు సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆమె పోటీ చేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్కు జవసత్వాలు లభిస్తాయని.. సంప్రదాయ ముస్లిం మైనారిటీ, దళిత క్రిస్టియన్ ఓట్లన్నీ పార్టీ ఖాతాలోకి తిరిగి వస్తాయని.. కానిపక్షంలో ఈ ఓట్లన్నీ వైసీపీకి వెళ్లిపోతాయని హెచ్చరించారు. తాను పోటీచేస్తే పార్టీకి కలిగే లాభనష్టాలపై ఒక్కముక్కలో చెప్పాలని ఆమె కోరినప్పుడు ఆయా నేతలు పై వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని సీనియర్లు కూడా.. షర్మిల కడప నుంచే పోటీచేయాలని సూచిస్తున్నారు.
ప్రధానంగా సీనియర్ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ.. కడప లోక్సభ బరిలోదిగితే.. వైఎస్ రాజశేఖర్రెడ్డికి నిజమైన వారసురాలిగా షర్మిల ప్రజల్లోకి వెళ్తారని అన్నారు. ‘రాజశేఖర్రెడ్డి అంతిమ కోరిక రాహుల్గాంధీని ప్రధానిని చేయడం.. వైఎస్ వివేకానందరెడ్డి చివరి కోరిక షర్మిల కడప ఎంపీ కావడం.. షర్మిల పోటీతో ఈ రెండు కలలూ నెరవేరతాయి’ అని తెలిపారు. నేతల మనోభావాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని.. దాని ఆదేశాల మేరకు కడప నుంచే కాకుండా.. రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమేనని షర్మిల వెల్లడించారు.
పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు, నేతల్లో నూతనోత్సాహం నెలకొందని.. ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తే పార్టీ పునరుజ్జీవానికి దోహదపడుతుందని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ముంబైలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ.. కడప నుంచి లోక్సభకు పోటీచేయాలని షర్మిలకు సూచించారు. నాటి నుంచి దీనిపై ఆమె కసరత్తు చేస్తున్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా తీర్మానం చేయడంతో కడప.. గడపలో వైఎస్ కుటుంబసభ్యుల మధ్య పోటీ తప్పదనే ప్రచారం జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE