మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఈసారి టికెట్ కష్టమేనా..? ఆయన త్యాగరాజు కాబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గుడివాడ అమర్నాథ్కు ఈసారి ఆ టికెట్ను వైసీపీ హైకమాండ్ నిరాకరించింది. ఆయన స్థానంలో అనకాపల్లి టికెట్ను మలసాల భరత్కు వైసీపీ కేటాయించింది. ఈక్రమంలో గుడివాడ అమర్నాథ్ పోటీ చేయబోయే స్థానాలకు సంబంధించి రకరకాల ఊహాగాణాలు వెలువడుతున్నాయి. చివరికి ఈసారి ఆయనకు టికెట్ కష్టమేననే వాదన వినిపిస్తోంది.
2019 ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ వైసీపీ తరుపున అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థి తెలుగు దేశం పార్టీకి చెందిన పీలా గోవింద సత్యనారాయణపై 8 వేల ఓట్ల మెజార్టీతో అమర్నాథ్ గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో కూడా చోటు దక్కించుకున్నారు. అయితే మంత్రి పదవి చేపట్టిన తర్వాత అమర్నాథ్పై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. నియోజకవర్గంలో వర్గ పోరుకు తెరలేపారని.. తన అనుచరులను దూరం చేసుకున్నారని గుసగుసలు వినిపించాయి. అందుకే ఈసారి అనకాపల్లి టికెట్ను హైకమాండ్ ఆయనకు ఇవ్వలేదని వార్తలొచ్చాయి.
ఇక వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్ను గుడివాడ, చోడవరం, ఎలమంచిలి, పెందుర్తి స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయా స్థానాల్లో సిట్టింగ్లు కదిలేది లేదని పట్టుపట్టుకొని కూర్చున్నారట. గుడివాడ, చోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎట్టిపరిస్థితిలోనైనా ఈసారి కూడా తమకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ వద్ద పట్టుపడుతున్నారట. చోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తాను ఆ స్థానం నుంచి కదలనంటే కదలనని అంటున్నారట. అటు జగన్మోహన్ రెడ్డి కూడా వారిని కాదనలేని పరిస్థితి ఉందని తెలుస్తోంది.
అటు ఎలమంచిలిలో కూడా అదే పరిస్థితి నెలకొందట. ప్రస్తుతం పెందుర్తి టికెట్ అమర్నాథ్కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ అక్కడ సామాజిక సమీకరణాలు అడ్డు వస్తున్నాయట. ఆ నియోజకవర్గంలో వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈక్రమంలో అదే సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించాలని జగన్ అనుకుంటున్నారట. అటు సర్వేల్లో కూడా వెలమ వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దించితేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలిందట.
ప్రస్తుతం పెందుర్తి నియోజకవర్గానికి అదీప్ రాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈక్రమంలో పెందుర్తిలో అదీప్ రాజ్నే కంటిన్యూ చేయాలని జగన్ అనుకుంటున్నారట. దీంతో పెందుర్తి టికెట్ కూడా అమర్నాథ్కు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత పరిణామాల మధ్య గుడివాడ అమర్నాథ్కు టికెట్ దక్కే అన్ని దారులు మూసుకుపోయినట్లు కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అసలు ఆయనకు టికెట్ దక్కుతుందా? లేక త్యాగరాజు అవుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE