ఆంధ్రప్రదేశ్లో పవర్ హాలిడే ప్రకటించడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రమంతటా గ్రామాల్లో 14 గంటలు, పట్టణాల్లో 8 గంటలు అనధికారిక విద్యుత్ కోతలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ఆస్పత్రులలో కరెంట్ లేక చివరికి ఫోన్ వెలుతురులో ప్రసవాలు చేయాల్సి రావడం దారుణమన్నారు. పవర్ హాలిడే ప్రకటన వలన ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతుందని, దీనిపై ఆధారపడ్డ 36 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏ ఒప్పందాలు రద్దు చేసిందని, దాని ఫలితమే ఈనాటి దుస్థితికి కారణమని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
ఇంకా ఆయన ఇలా అన్నారు.. ప్రభుత్వ విధానాలు, పాలసీల గురించి మాట్లాడితే.. తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడి తన సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. తాను ఇలాంటి వాటికి భయపడే రకం కాదని, వ్యక్తిగత అజెండాతో జనసేన పార్టీని స్థాపించలేదని స్పష్టం చేశారు. అనాలోచిత నిర్ణయాలు, హడావిడి నిర్ణయాలతో రాష్ట్ర ప్రగతి కుంటూ పడుతోందని విమర్శించారు. ఉద్యోగులు రోడ్డెక్కటానికి, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవటానికి ఈ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. కేవలం 2 రూపాయలకే గ్రీన్ ఎనర్జీ తీసుకొస్తామన్నారని, ఇప్పుడు 20 రూపాయలకు కోల్ ఎనర్జీ కొనుక్కోవాల్సిన పరిస్థితిలో రాష్ట్రం ఉందని అన్నారు. అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు.. ఇప్పుడేమో ఏకంగా 57% చార్జీలు పెంచారని పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ