రాయలసీమ జిల్లాల పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 3, మంగళవారం నాడు తిరుపతిలో రాయలచెరువు రోడ్డులోని రైతు బజారును సందర్శించారు. అక్కడ ఉల్లిపాయలు కోసం వేచియున్న ప్రజలతో మాట్లాడి, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఉల్లి కోసం ప్రజలు పడుతున్న కష్టాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన విమర్శించారు. ప్రభుత్వం రైతు బజార్లో కిలో ఉల్లిపాయలు రూ.25 కే ఇస్తున్నామని చెబుతున్నా అమలు జరగడం లేదని చెప్పారు. సామాన్య ప్రజల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని, అన్ని సమస్యలను గత ప్రభుత్వాలపై నెట్టివేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాలు తీర్చే సమర్థత లేకపోతే ప్రభుత్వం తప్పుకొని మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని అన్నారు.
రైతు బజార్ సందర్శనలో రైతులు, వ్యాపారాలు, కొనుగోలు దారులు కష్టాలు విన్న అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇసుక కొరత లాగానే ఉల్లి కోసం కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, మరోవైపు రైతు బజార్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని కొనుగోలు దారులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే మధ్యలో దళారులు బాగుపడుతున్నట్టు ఉందని అన్నారు. ఈ ప్రభుత్వానికి భవంతులు కూలగొట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజల కష్టాలపై పెట్టి ఉంటే బాగుండేదని చెప్పారు. ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకుని ప్రజలకు ఉల్లిపాయలు అందుబాటులోకి తీసుకురావాలి లేకుంటే ప్రజలందరితో కలిసి ఆందోళనను ముందుకు తీసుకెళ్తామని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
[subscribe]