పొత్తు ధర్మం అందరూ పాటించాల్సిందే..! ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే చెప్పే మాట. చంద్రబాబుకు ఈ విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే పొత్తు ప్రారంభ రోజుల్లో చంద్రబాబు పవన్ను సంప్రదించకుండా రెండు నియోజకవర్గాలను ప్రకటించారు. ఇక ఆ తర్వాత పవన్ చంద్రబాబుపై బహిరంగంగా విమర్శలు చేశారు. అప్పటినుంచి అభ్యర్థుల ప్రకటనపై ఇద్దరూ చర్చించుకున్న తర్వాతే ఓ నిర్ణయానికి వస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. ఇందులో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రెండు అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటి చేయాలని చూస్తోంది. అందులో విజయవాడ వెస్ట్తో పాటు అవనిగడ్డ కూడా ఉంది. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాల్లో కాపుల ఓట్లే కీలకం. ఓవైపు విజయవాడ వెస్ట్ గురించి పోతిన మహేశ్ సెగ ఇప్పటికే పవన్ కళ్యాణ్కు తగలగా.. మరోవైపు అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ అలక చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. అవనిగడ్డ టికెట్ జనసేనకు కాకుండా టీడీపీ నుంచి బుద్ధప్రసాద్కు ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి డిమాండ్ కూడా కాదు.. వార్నింగే ఇస్తున్నారు.
గతంలో ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్గా మండలి బుద్ధప్రసాద్ పని చేశారు. కృష్ణా జిల్లాపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయన ఆసారి అవనిగడ్డ టికెట్ ఆశించారు. అయితే టికెట్ జనసేనకు కేటాయించాలని ఇప్పటికే చంద్రబాబు-పవన్ నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై చాలా కాలంగా బుద్ధప్రసాద్ ఆవేదన చెందుతున్నారు. అవనిగడ్డలో సమావేశమైన ఆరు మండలాల నేతలు బుద్ధప్రసాదఖకు పార్టీ నాయకత్వం టికెట్ కేటాయించకపోతే టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. మరోవైపు స్థానిక ప్రజలు తమ ఇష్టాన్ని తెలియజేయాలని కోరుతూ జనసేన టెలిఫోన్ సర్వేలు నిర్వహిస్తోంది. ముగ్గురు అభ్యర్థులు బండ్రెడ్డి రామకృష్ణ, చిక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణలపై సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తయిన తర్వాత అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని నిలబెట్టడంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అవనిగడ్డ నియోజకవర్గంలో కాపు ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు. అందుకే రాజకీయ పార్టీలు అవనిగడ్డలో కాపు అభ్యర్థులను బరిలోకి దింపాయి. జనసేన ఆదివారం 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, ఇంకా ముగ్గురి పేర్లను ప్రకటించాల్సి ఉంది.
మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ నుంచి 1999, 2004, 2014లో మూడుసార్లు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేశ్బాబు చేతిలో ఓడిపోయారు. ఈ సారి కూడా అవనిగడ్డ నుంచే మండలి పోటి చేయాలని భావిస్తున్నారు. అది కుదిరే అవకాశం లేదని తెలియడంతో తన కార్యకర్తలతో, అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవనిగడ్డ నుంచి జనసేనే పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. నిజానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి జనసేనకు సమస్యలు ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దింపాలని చూస్తోంది. మాజీ టీడీపీ నేత, ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనా చౌదరి పేరు విజయవాడ వెస్ట్ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇలా ఒకే జిల్లాలో నెలకొన్న రెండు సమస్యలను జనసేన ఎలా సాల్వ్ చేస్తుందో చూడాలి మరి!
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY