సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఏపీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల పదవి చేపట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుంది. ఇటు షర్మిల వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకు వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, తెలుగు దేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలకు ఏపీ కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.
మొన్నటి వరకూ కాంగ్రెస్ ఉనికే లేనట్లుండే ఏపీలో ఇప్పుడు కాంగ్రెస్లో కాక రేపుతోంది. ఇదే ఊపుతో రాబోయే ఎన్నికల బరిలో దిగడానికి పార్టీ నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు అతి త్వరలో ప్రజలలోకి వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏ జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని మొదలు పెట్టనుందనే విషయాన్ని పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి తెలియజేశారు.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో తామంతా మాట్లాడి అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభిస్తామని రఘువీరారెడ్డి వెల్లడించారు. చాలా పెద్ద ఎత్తున తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 26న మల్లికార్జున ఖర్గే, మాణిక్యం ఠాగూర్తో పాటు వైఎస్ షర్మిలతో కలసి తాము ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని ప్రకటించారు.
మరోవైపు ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రెడీ అయ్యిందన్న ఆయన.. ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ అగ్రనేతలు పాల్గొంటారని మాణిక్యం ఠాగూర్ వివరించారు. ఏపీలో జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశాఖపట్నం వస్తున్నారని..రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా వస్తారని ఆయన తెలిపారు.
ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకా గాంధీ కూడా ఏపీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ పాల్గొంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కట్టుబడి ఉన్నారని అన్నారు. తమ అజెండా చాలా క్లియర్గా ఉందని స్పష్టం చేసిన ఆయన.. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రయోజనాలను ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టేశారని ఎద్దేవా చేశారు.