త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తోంది. మార్చి రెండో వారంలో లోక్ సభ ఎన్నికలతో పాటు, షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయపార్టీలన్నీ దూకుడు పెంచుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునేపనిలో పడ్డాయి. అధికార పక్షం సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఫోకస్ పెడితే.. ప్రతిపక్షం సభలు, సమావేశాల ద్వారా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. అలాగే.. అధికార పార్టీ చేసిన తప్పిదాలను హైలెట్ చేసేందుకు వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశాన్ని పదే పదే లేవనెత్తుతున్నాయి. టీడీపీనే కాదు.. జనసేన, కాంగ్రెస్ కూడా ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారంటూ జగన్ ను ప్రశ్నిస్తున్నాయి. షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల ప్రచారం మొదలైతే.. ఈ జోరు మరింత పెరుగుతుంది. దీన్ని పసిగట్టిన జగన్ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు.
విపక్షాల వ్యూహాలను తిప్పికొడుతూ, ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రత్యేక హోదాపై జగన్ తాజాగా స్పందించారు. ఇప్పటి వరకూ హోదా ఎందుకు రాలేదో వివరించారు. ప్రత్యేక హోదా ప్రకటించారు కానీ, విభజన చట్టంలో ఆ అంశాన్ని కనీసం రాయలేదని అన్నారు. రాసి ఉంటే కోర్టుకు వెళ్లయినా సరే సాధించి తీరేవారమని తెలిపారు. కేంద్రం ఇస్తే తప్పా.. డిమాండ్ చేసి సాధించే హక్కు లేకుండా పోయిందన్నారు. అందుకే కేంద్రంలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మన అవసరం ఏర్పడే అవకాశం ఉంటే.. ప్రత్యేక హోదా, నిధులపై డిమాండ్ చేసే చాన్స్ ఉంటుందని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం చూస్తూ ఉండిపోకుండా రాష్ట్ర అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలన్నీ చేపడుతున్నట్లు వివరిస్తున్నారు.
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం జగన్ ప్రసంగంలో విభజన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత అప్పులు, అడ్డగోలు విభజన, ప్రత్యేక హోదా ఇలా అన్ని అంశాలపైనా సుధీర్ఘంగా మాట్లాడారు సీఎం. ఈ క్రమంలోనే హైదరాబాద్ కోల్పోవడం వలన ఏపీకి ఎంత నష్టం జరిగిందో, వైజాగ్ మీద ఎందుకు దృష్టి పెట్టామో వెల్లడించారు. అలాగే ఏపీ రాజధానిగా విశాఖను ఎంపిక చేయడానికి గల కారణాలను ఆయన వివరించారు. ఇదే సందర్భంలో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని, హైదరాబాద్ను కోల్పోవటంతో ఆదాయం కోల్పోయామని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం, హైదరాబాద్ను కోల్పోవటంతో ఏపీ ఆదాయం బాగా తగ్గిందని అన్నారు. దీనికి కరోనా జతకావటంతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొందని అన్నారు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నగదు బదిలీ ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశామని వివరించారు.
హైదరాబాద్ను కోల్పోవటంతో ఏపీది రైతులు, వ్యవసాయంతో కూడిన ఎకానమీగా మారిందని జగన్ అన్నారు. అడ్డగోలు విభజన కారణంగా ఏటా 13 వేల కోట్లు నష్టపోయామని చెప్పారు. ఈ ఐదేళ్లలోనే లక్షకోట్ల అదనపు ఆదాయం కోల్పోయామన్న జగన్.. ఆర్థికలోటు ఇప్పటికీ రాష్ట్రాన్ని వెంటాడుతోందని అభిప్రాయపడ్డారు.హైదరాబాద్ను కోల్పోవడం ద్వారా పదేళ్లలో లక్షా 40 వేలకోట్లు నష్టపోయామని అన్నారు. అలాగే గత టీడీపీ ప్రభుత్వ విధానాల వలన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయని ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. ఇక రాష్ట్రం ఆర్థికంగా ఎదిగేందుకు పెద్దపెద్ద నగరాలు కావాలన్న జగన్.. ప్రతి రాష్ట్రానికి ఓ పవర్ హౌజ్ లాంటి నగరం ఉండాలన్నారు. మనకూ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలాంటి నగరాలు అవసరం ఉండడంతో, పెద్ద నగరంగా మారే అవకాశం ఉన్నందునే విశాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. ఇలా అసెంబ్లీ వేదికగా ప్రత్యేక హోదా, రాజధానుల అంశంపై జగన్ వివరణ ఇచ్చారు. తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటున్నానని చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE