ఏపీ రాజకీయాలు భగభగ మండిపోతున్న భానుడితో పోటీ పడి మరి హీటును పెంచేస్తున్నాయి. నేతల మాటలు, వారికి కౌంటర్లు, రీ కౌంటర్లతో రాజకీయ వాతావరణం రోజురోజుకు హీటెక్కిపోతుంది. పోటాపోటీగా అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారాలు, భారీ బహిరంగ సభలతో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది.
ఎన్నికలు వస్తున్నాయంటే తమ వ్యూహాలకు మరింత పదునుపెడుతూ ఉంటారు రాజకీయనాయకులు. ఎత్తుకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థులపై పై చేయి సాధించడానికి..వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా గెలుపే పరమావధిగా పావులు కదుపుతూ ఉంటారు. రాత్రికి రాత్రే రాజకీయ సమీకరణాలు మారిపోయేలా చేయడానికి ఎంత దూరమైనా వెళతారు. అవతలి పార్టీ దూకుడుగా వెళ్తుంటే ఆ పార్టీలను డిఫెన్స్ లో పడేయడం మిగతా పార్టీలు చేసే ప్రయత్నాలు అలాగే ఉంటాయి.
పొత్తు ప్రకటించి దూకుడుగా వెళ్తున్న టీడీపీ, జనసేన కూటమి పరిస్థితి అభ్యర్థుల ప్రకటన తర్వాత ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడినట్లే అయింది. ఇంత తక్కువ సీట్లు ఇచ్చారని జన సైనికులు, కాపు సామాజిక వర్గ నేతలు అసహనం వ్యక్తం చేయగా.. జనసేనపార్టీకి ముఖ్యమైన సీట్లు ఇచ్చి తమకు కోత పెట్టారంటూ టీడీపీ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. ఈ రెండు పార్టీల అధినేతలు..ఆ పార్టీల నేతలను బుజ్జగించి.. సముదాయించే పనిలో పడ్డారు.
కానీ ఈ కూటమి మీడియా సహకారంతో.. పార్టీలో కానీ, పార్టీ కేడర్లో కానీ ఎలాంటి అసంతృప్తి లేదని.. అంతా సవ్యంగా సాగుతుందనే విషయాన్ని చంద్రబాబు, పవన్ ప్రజల్లోకి బాగానే తీసుకెళ్తున్నారు. కూటమిని చీల్చడానికి, తమలో తమకు అంతర్గత కుమ్ములాటలు పెంచడానికి వైసీపీ నేతలే ఇలా రెచ్చగొడుతున్న విషయాన్ని కూడా ఏపీ వాసులకు అర్ధం అయేలా చేస్తున్నారు. కాపు సంఘాల మధ్య చిచ్చు పెట్టి వినోదం చూద్దామనుకున్న వైసీపీ నేతల ఆలోచనలకు ఆదిలోనే ఫుల్ స్టాప్ పడేటట్లు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ నేతలు డిఫెన్స్ లో పడిపోయారు.
మరోవైపు జగన్ వదిలిన బాణంగా గత ఎన్నికలలో అన్నకు మద్దతుగా నిలిచిన చెల్లెలు షర్మిల..ఈ ఎన్నికలలో అదే అన్నను గద్దె దించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తనకు, విజయమ్మకు జగన్ చేసిన మోసాన్ని జనాలకు తెలియజేస్తూనే..ఇన్నాళ్లు అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రం కోసం ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలంటూ సవాల్ విసురుతున్నారు.
ఇదే సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూతురు, జగన్ సోదరి సునీతా రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి మరీ.. జగన్ అన్నకు ఓటేయ్యెద్దని ప్రకటించారు. దీంతో హూ కిల్డ్ బాబాయ్ అనే నినాదాన్ని టీడీపీ, జనసేన కూటమి ఎత్తుకుంది. దీంతో ఒక్కసారిగా వైసీపీ మంత్రులందరూ.. ఈ విషయంపై ప్రతిఘటించే దానిపై ఫోకస్ పెట్టారు.
తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈ సారి ఏపీలో వైసీపీ గెలవదంటూ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ సోషల్ మీడియాతో పాటు వైసీపీ అనుకూల మీడియా.. పార్టీలో సీనియర్ నాయకులు, మంత్రులు పీకేకు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. అందరి కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి దూసుకుపోదామని భావించిన వైసీపీ అధినేతకు ఆదిలోనే హంసపాదులా అసంతృప్తుల సెగ తగిలింది. దీనికి తోడు నేతలంతా కౌంటర్ అటాక్లకే సమయం కేటాయిస్తున్నారు తప్ప..ప్రచారానికి మాత్రం వెళ్లడం లేదు. దీంతో అన్ని పార్టీల కంటే కూడా వైసీపీ వెనకబడినట్లే కనిపిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ