ఏపీలో ఏప్రిల్ 8 న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం నాడు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆవేదన, బాధతో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని అన్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. 2014 లో 2 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా ప్రస్తుతం 24 శాతం అయ్యాయని, అలాగే అప్పుడు 0.9 శాతం జెడ్పీటీసీ ఎన్నికలు ఏకగ్రీవం కాగా, ఇప్పుడు 19 శాతం అయ్యాయని చెప్పారు.
ఎన్నికలు స్వేచ్ఛాయుత పద్ధతిలో జరుగుతాయని నమ్మకం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవన్న విషయాన్ని తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో కూడా తమిళనాడులో దివంగత సీఎం జయలలిత, పశ్చిమబెంగాల్ లో దివంగత సీఎం జ్యోతిబసు కూడా స్థానిక ఎన్నికలను బహిష్కరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ