ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం కోవిడ్-19 పై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముందుగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను, వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ విస్తరణ గణనీయంగా తగ్గిందని, పాజిటివ్ కేసులు కూడా గణనీయంగా తగ్గాయని చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ యాక్టివిటీ కేసుల రేటు 0.82 శాతానికి పడిపోయిందని తెలిపారు. అనంతరం ఏపీలో అమలుతున్న రాత్రిపూట కర్ఫ్యూను తొలగించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే మాస్క్లు కచ్చితంగా ధరించేలా మార్గదర్శకాలు కొనసాగించాలని, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఫీవర్ సర్వే కొనసాగింపుతో పాటుగా, లక్షణాలు ఉన్నవారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలని, కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరంగా నిర్వహించాలన్నారు.
అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ను త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. సిబ్బంది తప్పనిసరిగా ఆసుపత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రుల్లో పరిపాలనా బాధ్యతలను, చికిత్స బాధ్యతలను వేరు చేయాలన్నారు. పరిపాలనా బాధ్యతలను అందులో నిపుణులైన వారికి అప్పగించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు, వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పారు. స్పెషలిస్టు వైద్యులకు ఇస్తున్న మూలవేతనంలో 50శాతం, వైద్యులకు 30 శాతం మేర ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇచ్చేలా మార్గదర్శకాలు తయారు చేశామని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ