రాజకీయ పార్టీ అన్నాక.. గెలుపోటములు ఎలాఉన్నా.. ప్రజాక్షేత్రంలో పోరాడాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు అండగా ఉంటామనే భరోసా కల్పించాలి. కానీ.. కొన్ని పార్టీల తీరు అందుకు విరుద్ధంగా ఉంటోంది. రాజకీయ పవనాలు తమకు అనుకూలంగా ఉంటే సై.. లేదంటే నై అంటున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న శ్రేణులను నట్టేట ముంచుతున్నారు. కారణాలు ఏమైనా.. కొందరు నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ అవనికపై మరో పార్టీ అవతరణకు అడ్డుకట్ట వేసేలా ఉంటున్నాయి. తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు అలానే ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ, వైఎస్ ఆర్టీపీతో పాటు గతంలో కూడా కొన్ని పార్టీలది అదే తీరు.
రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తాం.. అని ప్రకటించి, నేడో రేపో నామినేషన్లు వేస్తారనుకుంటున్న తరుణంలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల బ్యాక్ టర్న్ తీసుకున్నారు. ఏ పార్టీ అయితే తమ తండ్రి వెఎస్ రాజశేఖరరెడ్డి కష్టంతో అధికారంలోకి వచ్చి తమ కుటుంబాన్ని అన్యాయం చేసిందని ఆక్షేపించారో తిరిగి అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. తన పార్టీ వైఎస్సార్టీపీ జెండాను కింద పడేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండానే, కనీసం అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండానే అలా ఆ పార్టీ కనుమరుగవుతోంది. ఇక టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయన ఆ పార్టీ నుంచి ఈపార్టీలోకి రావడానికి కారణం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయరాదని ఆపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశించడం.
అలాగే.. తెలంగాణ ఉద్యమం నుంచీ పోరాటాలు చేసిన డా. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటిపార్టీ పేరిట ఓ పార్టీని ఏర్పాటు చేసి 2018 ఎన్నికల్లో మరి కొందరు అభ్యర్థులతోపాటు తాను కూడా పోటీ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో ఏర్పాటైన ఆపార్టీ గత ఆగస్టులో కాంగ్రెస్ గూటికి చేరి, మూణ్నాళ్లు గడవకుండానే స్వస్తిచెప్పి అక్టోబర్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్న బీఆర్ఎస్లో కలిసిపోయింది. దీంతో ఇంటిపార్టీ కథ కంచికి చేరింది. ఇక తెలంగాణ జనసమితి. తెలంగాణ ఉద్యమం ఆరంభం నుంచీ తెలంగాణ కోసం పనిచేసిన, తెలంగాణ జేఏసీ చైర్మన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ జయశంకర్ నేతృత్వంలో ఏర్పడిన పార్టీ. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తుల కంటే పాలనలో మార్పు నాశించి ఏర్పాటైన పార్టీ సైతం ఇటీవల కాంగ్రెస్తో కలిసి పొత్తుకు సిద్ధమై.. ఎందుకనో విరమించుకొని, మద్దతు వరకు పరిమితమైంది.
దశాబ్దం క్రితం రాజకీయాల్లో మార్పు కోసం ఉత్తుంగతరంగంలా వచ్చిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడం,మాజీ ఐఏఎస్ అధికారి డా.జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన లోక్సత్తా ఎన్నికలకు దూరం కావడం తెలిసిందే. ఒకటొకటిగా ఇంకొన్ని పార్టీలు ఇలా ఏ లక్ష్యంతో వెలిశాయో, ఆ లక్ష్యం నెరవేరకుండానే అలసిపోతున్నాయి. ముందుకు సాగలేక ఆగిపోతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE