మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో శుక్రవారం నాడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న, వైఎస్ వివేకా ఇంటి వద్ద వాచ్మెన్ గా పనిచేసిన రంగన్న వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేయించింది. వాచ్మెన్ రంగన్నను సీబీఐ అధికారులు శుక్రవారం జమ్మలమడుగు కోర్టుకు తీసుకెళ్లి మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయించారు. సెక్షన్ 164 కింద వాచ్మెన్ రంగన్న వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది.
ఈ నెలలో పలు తేదీల్లో వాచ్మెన్ రంగన్నను సీబీఐ అధికారులు విచారించారు. ఈ క్రమంలోనే రంగన్నకు కరోనా టెస్ట్ చేయించి, నెగెటివ్ రిపోర్టు రావడంతో వాంగ్మూలం నమోదు కోసం శుక్రవారం ఉదయం జమ్మలమడుగు కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. వాంగ్మూలం ఇచ్చే సమయంలో న్యాయమూర్తి, రంగన్న మాత్రమే లోపల ఉండగా, సీబీఐ అధికారులు బయటే ఉన్నట్టు తెలుస్తుంది. వాంగ్మూలం ఇచ్చిన అనంతరం రంగన్నను సీబీఐ అధికారులు తిరిగి అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి 8.30 సమయంలో పులివెందుల బస్టాండు వద్ద రంగన్నను విడిచిపెట్టారు. అనంతరం అక్కడి నుంచి రంగన్న తన ఇంటికి నడుచుకుంటూ వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి వాంగ్మూలంలో రంగన్న సంచలన విషయాలు వెల్లడించారంటూ ప్రచారం జరుగుతుంది. కాగా ఈ కేసులో విచారణ, వాంగ్మూల నమోదు సహా ఇతర అంశాలపై సీబీఐ ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ