చైనాను వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రపంచంలోని ఇతర దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అక్కడ వెలుగు చూసిన కొత్త వేరియంట్ బీఎఫ్.7 ప్రస్తుతం భారత్లో కలవరం సృష్టిస్తోంది. ఇప్పటికే 4 కొత్త వేరియంట్ కేసులు నమోదవగా.. తాజాగా మరో వ్యక్తికి కోవిడ్-19 నిర్ధారణ అయ్యింది. అయితే అతను చైనా నుంచి రావడం దేశంలో ఆందోళనకు కారణమవుతోంది. చైనా నుంచి శుక్రవారం మన దేశానికి వచ్చిన 40 ఏళ్ళ వయసు గల వ్యక్తికి పరీక్షించగా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అతడి శాంపిల్స్ను లక్నోలోని జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్కు పంపించారు. కాగా నవంబరు 25 తర్వాత ఆగ్రాలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదవడం ఇదే మొదటిసారి. దీనికి సంబంధించిన వివరాలను ఆగ్రా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఏకే శ్రీవాస్తవ తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. వృత్తి పరంగా చైనాలో నివాసం ఉంటున్న ఆ వ్యక్తి ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాకు శుక్రవారం వచ్చాడని, ఆయనకు స్క్రీనింగ్ చేయగా పాజిటివ్ అని వచ్చిందని వెల్లడించారు. దీంతో ఆయనను షాగంజ్ ప్రాంతంలోని తన ఇంట్లోనే ఐసొలేషన్లో ఉంచామని, ప్రస్తుతం అయితే అతడిలో రోగ లక్షణాలు కనిపించలేదని తెలియజేశారు. అలాగే ఈ వ్యక్తితో కలిసి చైనా నుంచి వచ్చిన వారిని సంప్రదించామని, వారిని కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరామని చెప్పారు. ఇక రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగ్రా రైల్వే స్టేషన్, బస్టాండ్లలో టెస్టింగ్ను పెంచామని, ఇదే క్రమంలో ‘తాజ్ మహల్’ సందర్శకులకు కూడా స్క్రీనింగ్ చేస్తున్నామని శ్రీవాస్తవ వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ